సౌకర్యాల లేమితో.. విద్యార్థుల అవస్థలు
ABN , Publish Date - Jun 29 , 2025 | 11:11 PM
మండలంలోని ఉంద్యాల గ్రామంలో జడ్పీహెచ్ఎస్, పీఎస్ పాఠశాలలు ఒకే చోట నిర్వహించడంతో గల కొన్నేళ్లుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అసౌకర్యాల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- జడ్పీహెచ్ఎస్, పీఎస్లు ఒకే చోట
చిన్నచింతకుంట, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఉంద్యాల గ్రామంలో జడ్పీహెచ్ఎస్, పీఎస్ పాఠశాలలు ఒకే చోట నిర్వహించడంతో గల కొన్నేళ్లుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అసౌకర్యాల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మొత్తం 180 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతోంది. ఇక్కడ కేవలం ఐదు తరగతి గదులున్నాయి. అవి కూడా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా సరిపోవడం లేదు. చాలీచాలని గదులతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే జీవశాస్త్రం పోస్టు ఖాళీగా ఉండటంతో విద్యార్థులు సైన్స్ బోధనకు దూరమవుతున్నారు. దీంతో పాటు మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీఎస్ పాఠశాలది ఇదే తీరు
జడ్పీహెచ్ఎస్ పక్కనే పీఎస్ పాఠశాల ఒకే చోట ఏర్పాటు చేయడంతో ఉపాధ్యాయులు ఒకే తరగతి గదిలో రెండేసి క్లాసులు బోధిస్తూ అసౌకర్యానికి గురి కావడం గమనార్హం. ఈ పాఠశాలలో 180 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు కేవలం రెండే తరగతి గదులు ఉన్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.