అన్ని సమస్యలకు భూ భారతితో పరిష్కారం
ABN , Publish Date - Apr 26 , 2025 | 10:59 PM
భూమికి సంబంధించిన అన్ని సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నగరపాలక పరిధిలోని యూబీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే, కలెక్టర్ విజయేందిర బోయి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అన్నం పెట్టే రైతును రాజును చేయాలన్నదే లక్ష్యం
జూన్లో గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు: యెన్నం
మహబూబ్నగర్ న్యూటౌన్, ఎప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): భూమికి సంబంధించిన అన్ని సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నగరపాలక పరిధిలోని యూబీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే, కలెక్టర్ విజయేందిర బోయి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికి అన్నం పెట్టే రైతన్నను రాజును చేయలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ భారతి చట్టంతో రికార్డుల్లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు, పొరపాట్లు ఉన్నా, విస్తీర్ణంలో, పేర్లలో వారసత్వ విషయంలో తప్పులు ఉంటే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సరి చేసుకోవాలన్నారు. ధరణి చట్టం ద్వారా రైతులకు నష్టం జరిగిందని గుర్తించి, మళ్లీ రైతులు నష్టపోరాదని 14 నెలల పాటు శ్రమించి భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం తెచ్చిందన్నారు. ఈ చట్టం గురించి గ్రామాల్లోని ప్రజలకు వివరించాలని సూచించారు. సన్న వడ్లు పండించాలని రైతులను నాడు కోరగా 69 శాతం మంది పండించారన్నారు. వారికి బోనస్ కింద ప్రతీ రైతుకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు అదనంగా వారి ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరిగిందని, ఈ సారి 90 శాతం మంది రైతులు సన్నరకం వడ్లను పండిస్తున్నారన్నారు. అదనపు కలెక్టర్లు మోహన్ రావు, శివేంద్ర ప్రతాప్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహరెడ్డి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితరెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, షబ్బీర్ అహ్మద్, బుద్దారం సుధాకర్ రెడ్డి, హన్మంతు, రామాంజనేయులు, ఖాజాపాషా, అంజద్, రాషెద్, చిన్న, అధికారులు పాల్గొన్నారు.