నేటి నుంచి రెండో విడత శిక్షణ
ABN , Publish Date - May 19 , 2025 | 11:13 PM
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపుకోసం పాఠశాల విద్యాశాఖ.. ఉపాధ్యాయులకు ఇవ్వనున్న వేసవి రెండో విడత శిక్షణ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. స్కూల్ అసిస్టెంట్లకు మూడు విడతల్లో, ఎస్జీటీలకు ఒక విడతలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
ఉమ్మడి జిల్లాలో హాజరుకానున్న 7,500 మంది ఉపాధ్యాయులు
స్కూల్ అసిస్టెంట్స్కు జిల్లా కేంద్రాల్లో, ఎస్జీటీలకు మండల కేంద్రాల్లో..
మహబూబ్నగర్ విద్యావిభాగం, మే 19(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపుకోసం పాఠశాల విద్యాశాఖ.. ఉపాధ్యాయులకు ఇవ్వనున్న వేసవి రెండో విడత శిక్షణ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. స్కూల్ అసిస్టెంట్లకు మూడు విడతల్లో, ఎస్జీటీలకు ఒక విడతలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. స్కూల్ అసిస్టెంట్లకు ఇప్పటికే మొదటి విడత ఈనెల 13 నుంచి 17 వరకు పూర్తయ్యింది. రెండో విడత శిక్షణకు పాఠశాల జిల్లా విద్యాశాఖ, అకడమిక్ మానిటరింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు శిక్షణ కొనసాగనుంది. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయుల హాజరు ఆన్లైన్ ద్వారా తీసుకుంటారు. శిక్షణకు ఎవరూ డుమ్మా కొట్టకుండా జియోట్యాగింగ్ ఏర్పాటు చేశారు. ఎస్జీటీలకు కూడా మండల కేంద్రాల్లో నేటి నుంచి శిక్షణ ప్రారంభం కానుంది.
3,227 ప్రభుత్వ పాఠశాలలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో 12,854 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. అందులో 2,760 మందికి మొదటి విడతలో శిక్షణ ఇచ్చారు. రెండో విడతలో స్కూల్ అసిస్టెంట్స్ తోపాటు ఎస్జీటీలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. 7,500పైగా ఉపాధ్యాయులు శిక్షణకు హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఇచ్చే శిక్షణకు మహబూబ్నగర్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మెరజుల్లా ఖాన్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ అబ్జర్వర్గా ఉండగా, ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించనున్నారు. విద్యాశాఖ అధికారులు, ఏఎంవోలు, సీఎంవోలు నిత్యం శిక్షణ కేంద్రాలలో ఉంటూ పర్యవేక్షించనున్నారు.
పాలమూరులో..
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో గల జేపీఎన్ఎ్స కళాశాలలో మంగళవారం నుంచి ఈ నెల 24 వరకు రెండో విడత శిక్షణ ఇవ్వనున్నారు. స్కూల్ అసిస్టెంట్స్ 830 మంది శిక్షణకు హాజరు కానున్నారు. ఆంగ్లం, సాంఘిక శ్రాస్తం, గణితం, భౌతిక, జీవశాస్త్రం, తెలుగు, హిందీ సబ్జెక్టుల వారికి శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని 17 మండలాల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 1700 మందికి జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో ఏర్పాటు చేసిన 10 కేంద్రాలలో శిక్షణ ఇవ్వనుండగా, జడ్చర్ల, రాజాపూర్, మిడ్జిల్, బాలానగర్, గండీడ్, భూత్పూర్ మండలాలకు సంబంధించి మండల కేంద్రాల్లోనే ఎమ్మార్పీలు శిక్షణ ఇవ్వనున్నారు. ఇక్కడ మండల విద్యాశాఖ అధికారులు ఇన్చార్జీలుగా వ్యవహరించనున్నారు.