రైల్వే స్టేషన్లో రూ. 50వేలు చోరీ
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:53 PM
హైదరాబాద్కు వెళ్లేందుకు హడావుడిగా వచ్చిన ఓ వ్యక్తి గద్వాల రైల్వేస్టేషన్లో టికెట్ తీసుకుంటుండగా అతని జేబులో నుంచి రూ. 50వేలు చోరీ జరిగిన సంఘటన ఆదివారం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్లో చోటు చేసుకొంది.
- బుకింగ్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకుంటుండగా ఘటన
గద్వాల క్రైం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్కు వెళ్లేందుకు హడావుడిగా వచ్చిన ఓ వ్యక్తి గద్వాల రైల్వేస్టేషన్లో టికెట్ తీసుకుంటుండగా అతని జేబులో నుంచి రూ. 50వేలు చోరీ జరిగిన సంఘటన ఆదివారం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్లో చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి బాధితుడు, రైల్వేపోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల పరిధిలోని కొండాపురం గ్రామానికి చెందిన రఘు అనే వ్యక్తి ఆదివారం ఉదయం 6.30 గంటల ట్రైన్లో హైదరాబాద్ వెళ్లేందుకు గద్వాల రైల్వేస్టేషన్లోని కౌంటర్లో టికెట్ కొరకు నిలబడ్డాడు. అయితే రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఒక్కసారిగా టికెట్ కోసం ఎగబడుతుండటంతో ఆ క్రమంలోనే తన జేబులో ఉన్న రూ. 50వేలు చోరీకి గురయ్యాయి. టికెట్ తీసుకునే సమయంలో తన జేబులో ఉన్న డబ్బులు పోయిన విషయం గమనించిన రఘు వెంటనే అక్కడ ఉన్న రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే దొంగ ఆచూకీ కనపడక పోవడంతో వెంటనే మహబూబ్నగర్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు రఘు తెలిపారు.