రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:33 PM
పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ డీకే అరుణ కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్నకు విజ్ఞప్తి చేశారు.
- కేంద్రమంత్రికి ఎంపీ, ఎమ్మెల్యేల వినతి
మహబూబ్నగర్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ డీకే అరుణ కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్నకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చి సమస్యలను వివరించారు. పాలమూరు పట్టణంలో రైల్వే గేట్లు పడినప్పుడల్లా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. పట్టణంలోని తిర్మల్దేవుని గుట్ట, బోయపల్లి, తిమ్మసానిపల్లి రైల్వే గేట్ల వద్ద ఓవర్ బ్రిడ్జీలు, సద్దలగుండు, దివిటిపల్లి వద్ద పాదచారుల కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జీలను వంద శాతం కేంద్ర నిధులతో ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ, ఎమ్మెల్యేలు తెలిపారు.