పాలమూరు పోలీస్ అలర్ట్
ABN , Publish Date - May 09 , 2025 | 11:17 PM
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల పోలీసులను అలర్ట్ చేసింది.

మహబూబ్నగర్, మే 9 (ఆంధ్రజ్యోతి): భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల పోలీసులను అలర్ట్ చేసింది. పోలీస్శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సెలవులను రద్దు చేసి అందరూ 24 గంటలు ఆన్డ్యూటీలో ఉండాలని వచ్చిన ఆదేశాల మేరకు పాలమూరు పోలీస్శాఖ అప్రమత్తమైంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని జిల్లాల ఎస్పీలు తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బందికి, అధికారులకు కొద్దిరోజులపాటు అన్ని రకాల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సిక్ లీవ్లను కూడా రద్దు చేసింది. షిఫ్ట్లు మారిన వారు కూడా జిల్లాలు దాటి వెళ్లకుండా అందుబాటులో ఉండాలని, ఎప్పుడు పిలిచినా నిమిషాల వ్యవధిలో డ్యూటీలో చేరేలా వారిని అప్రమత్తం చేసింది. కొత్త వ్యక్తులు, అనుమానితులపై నిఘా ఉంచాలని, అదే విధంగా సోషల్ మీడియా పోస్టులపైనా నిఘా ఏర్పాటు చేశారు. రెచ్చగొట్టే వ్యాక్యలు, మతాల మధ్య చిచ్చు రగిల్చే వ్యాక్యలు సోషల్ మీడియాల్లో పెట్టవద్దని, అలాంటి పోస్టులపై చర్యలు తప్పవని ఇప్పటికే పోలీస్శాఖ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్కు సమీపంలోని జిల్లా కావడంతో పోలీస్శాఖ ముందస్తు భద్రత చర్యలు చేపట్టింది. గుర్తింపు కార్డులు లేకుండా లాడ్జిలలో వసతి కల్పించవద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భారత్ - పాకిస్థాన్ల మధ్య యుద్ధం నడుస్తుండటంతో పోలీస్శాఖ అప్రమత్తమైంది. పాలమూరు నగరంతో పాటు జడ్చర్ల పట్టణంలో శుక్రవారం పోలీసులు జనావాస ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. పోలీస్ డాగ్స్క్వాడ్, బాంబ్స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, జంక్షన్ల వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ప్రజలు ఎవరూ అనుచిత పోస్ట్లు, తప్పుడు సమాచారం పోస్ట్ చేయవద్దని ఎస్పీ జానకి ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశ భధ్రత, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాక్యలు చేయవద్దని సూచించారు. సోషల్ మీడియాపై పటిష్ట నిఘా కొన సాగుతుందని, అందరూ చట్టానికి లోబడి వ్యవహరించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని బాధ్యత గల పౌరులు వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.