పదేళ్ల పాలనలో ఉద్యోగాల్లేవ్
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:20 PM
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇస్తుంటే కోర్టులలో కేసులు వేస్తున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్సరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సొంత నిధులతో మహబూబ్నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ కళాభవన్లో 75 రోజుల పాటు నిర్వహించిన ఉచిత శిక్షణ ముగిసింది.
ఇప్పుడిస్తుంటే కోర్టులలో కేసులేస్తున్నారు
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్సరెడ్డి
మహబూబ్నగర్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇస్తుంటే కోర్టులలో కేసులు వేస్తున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్సరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సొంత నిధులతో మహబూబ్నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ కళాభవన్లో 75 రోజుల పాటు నిర్వహించిన ఉచిత శిక్షణ ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేపర్ లీకేజీలు లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఉద్యోగాలిస్తుంటే చిన్న చిన్న కారణాలు పట్టుకుని కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. గ్రూప్ వన్ కూడా వారి నిర్వాకం వల్లనే పెండింగ్లో ఉందన్నారు. ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇదివరకు ఖాళీలు ఉంటే తమకు కావలసిన వారికి, అర్హత లేని వారికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇక్కడ కోచింగ్ తీసుకున్న ఎంతోమంది ఉద్యోగాలు సాధించారని చెప్పారు. అనుభవజ్ఞులైన హైదరాబాద్ ఫ్యాకల్టీతో బోధన చేయిస్తున్నామని అన్నారు. ఉచిత శిక్షణ నిరంతరం కొనసాగిస్తామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదువు మనిషిని నిలబెడుతుందని, అది ఎప్పటికీ ఎక్స్ఫైర్డ్ కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ప్రైవేట్ రంగంలోనూ ఎన్నో అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు. కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు సీజే బెనహర్, గుండా మనోహర్ పాల్గొన్నారు.