క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:16 PM
నూతన ఎస్ఐలుగా బాధ్యతలు చేపట్టిన వారు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.
- మొదటి పోస్టింగ్ జీవితాంతం గుర్తుండాలి
- వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్
- ఆరుగురు నూతన ఎస్ఐలకు పోస్టింగులు
వనపర్తి, జూలై9 (ఆంధ్రజ్యోతి) : నూతన ఎస్ఐలుగా బాధ్యతలు చేపట్టిన వారు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జిల్లాలో నూతన ఎస్ఐలుగా బాధ్యతలు చేపట్టనున్న ఆరుగురితో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొదటి సారి ఎస్ఐలుగా బాధ్యతలు చేపడుతున్నారని, ఆ ప్రాంత ప్రజలకు జీవితాంతం గుర్తుండేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, చిన్న సమస్యలైతే అప్పటికప్పుడు పరి ష్కరించేలా చొరవ తీసుకోవాలని కోరారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ హిమబిందు, పెబ్బేరు ఎస్ఐ దివ్యారెడ్డి, ఖిల్లాఘణపూర్ ఎస్ఐ నరేశ్, వనపర్తి రూరల్ ఎస్ఐ వేణుగోపాల్, వనపర్తి టౌన్ ఎస్ఐ శశిధర్, కొత్తకోట ఎస్ఐ భాస్కర్లు ఎస్పీకి మొక్క అందించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్ పాల్గొన్నారు.