సమగ్ర సమాచారంతో రావాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 10:48 PM
జిల్లాలోని 16 మండలాల ఎంపీవోలు సమగ్ర సమాచారంతో ఈనెల 17న జరిగే మంత్రి సమీక్షా సమావేశానికి, నేడు నిర్వహించే దిశ మీటింగ్కు హాజరుకావాలని డీపీవో పార్థసారథి ఆదేశించారు.

- డీపీవో పార్థసారథి
మహబూబ్నగర్ న్యూటౌన్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని 16 మండలాల ఎంపీవోలు సమగ్ర సమాచారంతో ఈనెల 17న జరిగే మంత్రి సమీక్షా సమావేశానికి, నేడు నిర్వహించే దిశ మీటింగ్కు హాజరుకావాలని డీపీవో పార్థసారథి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో అన్ని మండలాల ఎంపీఈవోలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, మాట్లాడారు. గ్రామాల్లో నీటి ఎద్దడిపై ప్రధానంగా చర్చ ఉంటుందని, మీ మండలాల్లో ప్రస్తుతం తాగునీటి సమస్యలు ఎదుర్కుంటున్న గ్రామాలు, తండాల వివరాలు సమగ్రంగా సమర్పించాలన్నారు. మేలో ఎండలు తీవ్రతరం కానుండటంతో ఏయే గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే వాటి వివరాలు కూడా సమర్పించాలన్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో జిల్లాలో 171 గ్రామాల్లో జీపీల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీలైతే మరిన్ని గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. బాలానగర్ మండలంలో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ గ్రామ పంచాయతీల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాని ఎంపీవోకు సూచించారు. ఇంటిపన్నులు నేటికి 97 శాతం మాత్రమే వసూలు చేశారని, మిగిలిన 3శాతం కూడా వసూలు చేయాలన్నారు.
ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు
జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి సినీయర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించగా, వారిలో మహబూబ్నగర్ జిల్లాలో ముగ్గురికి పదోన్నతులు లభించాయి. ఎన్.భవ్యశ్రీకి నాగర్కర్నూల్ డీపీవో కార్యాలయానికి పదోన్నతిపై వెళ్తుండగా, రాజేష్ నారాయణపేట డీపీవో కార్యాలయానికి, శ్రీను వనపర్తి డీపీవో కార్యాలయానికి పదోన్నతిపై బదిలీ అయ్యారు.