ఆధునిక పద్ధతులు అవలంభించాలి
ABN , Publish Date - May 29 , 2025 | 11:05 PM
వ్యవసాయ రంగంలో రైతులు ఆధునిక పద్దతులు అవలంభించాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ భరత్భూషణ్ రైతులకు సూచించారు.
- ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ భరత్ భూషణ్
భూత్పూర్, మే 29 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ రంగంలో రైతులు ఆధునిక పద్దతులు అవలంభించాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ భరత్భూషణ్ రైతులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ భరత్ భూషణ్, పాలెం పరిశోదన కేంద్రం, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కల్యాణి పాల్గొని, వ్యవసాయ రంగంలో పాటించాల్సిన ఆధునిక పద్ధతుల గురించి రైతులకు వివరించారు. ముఖ్యంగా రసాయన ఎరువులు వాడరాదని, పచ్చి రొట్ట ఎరువులు వాడి కల్తీలేని ఆహార గింజలను పండించాలని శాస్త్రవేత్త డాక్టర్ భరత్ భూషణ్ రైతులకు సూచించారు. చీడ పీడల నివారణ విషయంలో రైతులు రసాయన మందుల కంటే వేపాకు కషాయం, పంచకావ్య, జీవాంమృతం వంటి ద్రవాలను వాడాలన్నారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం, పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కల్యాణి వ్యవసాయ సాగులో బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి పద్ధతులు అనుసరించాలన్నారు. భూసారం పెంచుకోవాలంటే పప్పుధాన్యం పంటలు సాగు చేయాలన్నారు. దేవరకద్ర ఏడీఏ రాజేందర్ అగర్వాల్, ఏవో మురళిధర్, హర్టీకల్చర్ అధికారి అనిల్కుమార్, సేరికల్చర్ అధికారి జనార్దన్, పశువైద్యాధికారి డాక్టర్ మధుసూధన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ పాల్గొన్నారు.