రైతులకు మహాప్రసాదం భూభారతి
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:29 PM
పేదరైతు కన్నీరు తుడవాలని రేవంత్రెడ్డి నాయకత్వంలో భూభారతి చట్టం తీసుకువచ్చామని, ఇది రైతులకు మహా ప్రసాదం లాంటిదని రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
- ధరణి నాలుగు గోడల మధ్య
తయారు చేసిన చట్టం
- చెప్పినట్లే ధరణిని
బంగాళాఖాతంలో కలిపేశాం
- సాదాబైనామా రైతులకు
పరిష్కారం చూపాం
- అవగాహన సదస్సులో రెవెన్యూ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
గద్వాల, ధరూర్ ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): పేదరైతు కన్నీరు తుడవాలని రేవంత్రెడ్డి నాయకత్వంలో భూభారతి చట్టం తీసుకువచ్చామని, ఇది రైతులకు మహా ప్రసాదం లాంటిదని రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ధరణి నలుగురు వ్యక్తులు, నాలుగు గోడల మధ్య కూర్చొని తయారు చేసిన చట్టం. ఇది పేద ప్రజలను రైతులను ఆదాలపాతాలానికి తొక్కిందని ఆరోపించారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధరణి చట్టాన్ని బంగాళఖాతంలో కలిపేశారని అన్నారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో భూ భారతి 2025 చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ధరణి ద్వార కలిగిన ఇబ్బందులు, దానితో నష్టపోయిన రైతులకు అండగా ఉండేం దుకు భూభారతి చట్టం వచ్చామని వివరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు పేరు, సర్వేనెంబర్లు, భూమి విస్తీర్ణం తప్పుగా పడితే రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకొని ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం లభించేం ది కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు భూ భారతి చట్టం ద్వార అధికారులు మీ గ్రామానికే వచ్చి రూపాయి ఖర్చు లేకుండా పరిష్కారం చూపుతారని తెలిపారు. సాదాబైనామాతో కొనుగోలు చేసి తరతరాలుగు పాస్ పుస్తకాలు లేకుండా వ్వవసాయం చేస్తున్నారో వారందరికి ఈ చట్టం పరిష్కారం చూపుతోందని వివరించా రు. అయితే 2020 ధరణి చట్టంలో రిజిస్ర్టేషన్ చేసుకొన్న అర్హులైన దరఖాస్తు దారులందరికీ పరిష్కారం చూపుతుందని వివరించారు. ఈ చట్టంలో ఏవైనా తప్పులు జరుగుతాయోనని మొదట పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. నాలుగు దిక్కుల నాలుగు జిల్లాలో నాలుగు మండలాల్లో దీనిని పరిశీలన చేస్తున్నామని వివరించారు. మే మొదటి వారం నుంచి రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి వచ్చి రైతులతో దరఖాస్తులు స్వీకరించి జూన్ 2వ తేదీ నాటికి పరిష్కారం చూపుతారని వివరించారు. ప్రతీ మనిషికి ఆధార్ కార్డు ఎలా ఉందో భవిష్యత్తు లో భూమికి కూడా భూధార్ కార్డును ఇచ్చేందుకు చట్టం లో పెట్టాం. దరణి చట్టంలోని లోపం వలన సాదాబైనామా దరఖాస్తులు 9,26,000 ఽ పెండింగ్లో ఉన్నా యని తెలిపారు. అందులోని అర్హులైన వారికి పరిష్కారం చూపిస్తామని వివరించారు. గత ప్రభుత్వంలో కొందరు భూములు లేకపోయిన రైతబంధు తీసుకున్నారు. వారందరిని ఏరిపారేస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ, రూ.500లకే గ్యాస్ తదితర పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. త్వరలో జిల్లాలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శంకుస్థాపన చేస్తామని వివరించారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు తదితరులు పాలొన్నారు.
- అలిగిన మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్
- స్టేజీ కింద ప్రజలతో కలిసి కూర్చున్న సరిత
మంత్రి పర్యటన ఉద్రిక్తతల మధ్య సాగింది. ఎమ్మెల్యే వర్గం 30 వాహనాలతో కాన్వాయ్ రాగా.. సరిత వర్గం కూడా దాదాపు అన్ని వాహనాలతో వచ్చారు. సమావేశం ప్రాంగణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేరుకోగానే సభావేదికపైకి పిలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీలను పిలిచారు. మంత్రి వెంట వచ్చిన మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్చార్జి సరితలను పిలవకపోవడంతో కార్యకర్తలు, నాయకులు నిరసనతో పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్యనే సభ ప్రారంభమైంది. ఆ వెంటనే సంపత్కుమార్ అక్కడి నుంచి వెళ్లి మంత్రి వాహనంలో కూర్చున్నారు. సరిత వేదిక కింద కుర్చీలో కూర్చున్నారు. సరిత వర్గం వారు ఎంపీతో వాగ్వాదం చేయడంతో ఎంపీ మల్లురవి కూడా కిందనే సరిత వద్ద కూర్చున్నారు. ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా ఇరువర్గాల నాయకులు అనుకూల, వ్యతిరేక నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటి మాట్లాడే సమయంలో మాత్రం అందరు శ్రద్ధగా విన్నారు. వాహనంలో వెళ్లేటప్పుడు మంత్రి రెండు నిమిషాలు సరిత, తిరుపతయ్యలతో మాట్లాడి వెళ్లిపోయారు.