మహబూబ్నగర్ జట్టు విజయం
ABN , Publish Date - May 28 , 2025 | 11:33 PM
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలో అండర్-23 ఉమ్మడి జిల్లా 2డే లీగ్లో మహబూబ్నగర్ జట్టు వనపర్తిపై 47 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది.
- వనపర్తి జట్టుపై 47 పరుగుల తేడాతో గెలుపు
- సెంచరీ, 4 వికెట్లు తీసి రాణించిన డేవిడ్ క్రిపాల్
- సెంచరీతో రాణించిన ఏ. శ్రీకాంత్
- 6 వికెట్లు తీసి చెలరేగిన ముఖీద్
- ఉత్సాహంగా సాగుతున్న క్రికెట్ 2డే లీగ్
మహబూబ్నగర్ స్పోర్ట్స్, మే 28(ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలో అండర్-23 ఉమ్మడి జిల్లా 2డే లీగ్లో మహబూబ్నగర్ జట్టు వనపర్తిపై 47 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. జిల్లా కేంద్రంలోని సమర్థ పాఠశాల మైదానంలో బుధవారం 4వ మ్యాచ్ నిర్వహించారు. తొలి ఇన్నింగ్లో మహబూబ్నగర్ జట్టు 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులకు డిక్లేర్ చేసింది. జట్టులో డేవిడ్ క్రిపాల్ 93 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో సెంచరీ (111), ఏ శ్రీకాంత్ 94 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్తో సెంచరీ(105) చేశారు. మహేష్నాయక్ 67 బంతుల్లో 4 ఫోర్లు 8 సిక్స్లతో అర్ధసెంచరీ(79) చేసి రాణించారు. తరుణ్ 41, కే. శ్రీకాంత్ 19 పరుగులు చేశారు. అనంతరం ఇన్నింగ్ ప్రారంభించిన వనపర్తి జట్టు 27.2 ఓవర్లలో 77 పరుగులకు మహబూబ్నగర్ బౌలర్ల దాటికి కూప్పకూలింది. జట్టులో పవన్కుమార్ 27, రోహిత్చరణ్ 17 పరుగులు చేశారు. మహబూబ్నగర్ బౌలర్లలో మహ్మద్ ముఖీద్ 6 వికెట్ల తీసి వనపర్తి జటున్టు తక్కువ స్కోర్కే కట్టడి చేశాడు. అభినవ్ 2, కే. శ్రీకాంత్ ఒక వికెట్ తీశారు. ఫాలో ఆన్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వనపర్తి జట్టు 33.3 ఓవర్లలో 191 పరుగులకు అలౌట్ అయ్యింది. 47 పరుగుల ఇన్నింగ్ తేడా మహబూబ్నగర్ ఘన విజయం సాధించింది. జిల్లా బౌలర్లలో మహ్మద్ ముఖీద్ 3, డేవిడ్ క్రిపాల్ 4 ఎ. శ్రీకాంత్ 2 వికెట్ల తీసి జట్టు విజయానికి కృషి చేశారు.
జాతీయ స్థాయికి ఎదగాలి
జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని క్రికెట్ సంఘం జిల్లా కోశాధికారి ఉదేష్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో నిర్వహిస్తున్న 2డే లీగ్ టోర్నీలో మహబూబ్నగర్-వనపర్తి జట్ల మధ్య మ్యాచ్ను ఆయన హాజరై ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు హెచ్సీఏ ఉమ్మడి జిల్లా 2డే లీగ్ నిర్వహణకు అవకాశం కల్పించిందన్నారు. టోర్నీలో క్రీడాకారుడు చక్కటి ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక కావాలని ఆకాక్షించారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఆడుతున్న క్రీడాకారులు చాలా మంది గ్రామీణ స్థాయి నుంచే వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సీనియర్ క్రీడాకారుడు రంజిత్ పాల్గొన్నారు.