సమ్మెతో కేంద్రం మెడలు వంచుదాం
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:14 PM
నాలుగు లేబర్ కోడ్ల రద్దు, కార్మికుల హక్కుల కోసం జూలై 9న చేపట్టిన దేశవ్యాప్త సమ్మెతో కేంద్రం మెడలు వంచుదామని ఆల్ట్రేడ్ యూనియన్స్ నాయకులు పిలుపునిచ్చారు.
- ఆల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు
పాలమూరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : నాలుగు లేబర్ కోడ్ల రద్దు, కార్మికుల హక్కుల కోసం జూలై 9న చేపట్టిన దేశవ్యాప్త సమ్మెతో కేంద్రం మెడలు వంచుదామని ఆల్ట్రేడ్ యూనియన్స్ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు రాములుయాదవ్ మాట్లాడారు. కార్మికులకు అన్యాయం చేసే నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులను కోరారు. కేంద్రం కార్మిక, వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని పెట్టుబడిదారి అనుకూల కార్పొరేట్ విధానాలు అవలంభిస్తోందన్నారు. టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ కార్మికవర్గం ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పనితో పాటు కనీస వేతన చట్టం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యూటీ, పెన్షన్ చట్టాలను నీరుగార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. కార్మికకులు తలుచుకుంటే దేశంలో ఉత్పత్తి స్తంభించిపోతుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి హెచ్చరించారు. బీఆర్టీయూ జిల్లా నాయకుడు నరేష్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దుర్మార్ఘంగా వ్యవహరిస్తూ సమ్మె హక్కును కాలరాస్తోందన్నారు. నాలుగు లేబర్కోడ్స్ను రద్దు చేయాలని టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు ధన్వాడ రాములు అన్నారు. జూలై 5న బైక్ర్యాలీలు చేపట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. 7న మోటార్ టాన్స్ఫోర్టు ఆటో ర్యాలీలు చేపట్టాలని, 9న సమ్మెను విజయవంతం చేయాలన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి మాకం రాంమోహన్, సీఐటీయూ రాజ్కుమార్, బాలు పాల్గొన్నారు.