రాజ్యాధికారంతోనే బీసీలకు సమన్యాయం
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:07 PM
రాజ్యాధికారంతోనే బీసీలకు సమన్యాయం చేకూరుతుందని నేషనల్ పొలిటికల్ జస్టిస్ చైర్మన్ వీజీఆర్ నారగోని ఆశాభావం వ్యక్తం చేశారు.

- నేషనల్ పొలిటికల్ జస్టిస్ చైర్మన్ వీజీఆర్ నారగోని
పాలమూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : రాజ్యాధికారంతోనే బీసీలకు సమన్యాయం చేకూరుతుందని నేషనల్ పొలిటికల్ జస్టిస్ చైర్మన్ వీజీఆర్ నారగోని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మహేంద్ర హాలులో బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలంగాణలో 62 శాతం ఉన్న బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపించటం సరికాదన్నారు. దేశంలో ములాయంసింగ్యాదవ్, కాన్షీరాం బీసీలు, ఎస్సీలు, బహుజనులు అభివృద్ధి చెందాలని పార్టీలు పెట్టి అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉంటే అంత మంది అసెంబ్లీ, పార్లమెంట్కి వెళ్లాలన్నారు. ఇక నుంచి ప్రతీ ఎన్నికల్లో బీసీల ఓట్లు బీసీలకే వేసుకుని బీసీలనే చట్ట సభల్లోకి పంపుదామన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల మాదిరి, బీసీలకు రిజర్వేషన్ స్థానాలు ఉండాలన్నారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పుష్ఫ, సంధ్యారాణి, విజయ్, మహేంద్ర, జె.అరుణ్కుమార్, ఎల్.భీమేష్, కె.కృష్ణ, పి.సునిల్యాదవ్, బాడీ మల్లేష్, దీపక్, కృష్ణ, రాములు పాల్గొన్నారు.