జడివాన
ABN , Publish Date - Sep 26 , 2025 | 10:53 PM
మహబూబ్నగర్ జిల్లాలో జడివాన కురిసింది. శుక్రవారం తెల్లవారుజామున మొదలైన వాన మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. 10 గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పాలమూరు నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
పాలమూరులో 10 గంటలు ఏకధాటిగా కురిసిన వర్షం
పొంగుతున్న వాగులు, చెక్డ్యామ్లు
నిండుకుండల్లా చెరువులు
కొత్త చెరువు అలుగుపారడంతో దిగువ కాలనీలకు వరద
స్తంభించిన జనజీవనం
మహబూబ్నగర్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మహబూబ్నగర్ జిల్లాలో జడివాన కురిసింది. శుక్రవారం తెల్లవారుజామున మొదలైన వాన మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. 10 గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పాలమూరు నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 గంటల వరకు జిల్లాలో సగటున 37.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తరువాత మరో 3 సెంటీ మీటర్లు వర్షం కురిసింది. ఆరు గంటల తరువాత కొంత తగ్గినట్లుగా అనిపించినా మధ్యాహ్నం 2 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. కోయిల్సాగర్కు భారీగా వరద వస్తుండటంతో మూడు గేట్లను ఎత్తారు. కోయిలకొండ మండలం మల్కాపూర్ వాగు వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మూసాపేట, అడ్డాకుల మీ దుగా ప్రవహించే పెద్దమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బాలానగర్, హన్వాడ మండలాల్లో చెరువులు అలుగులు పారుతున్నాయి. ఆగస్టులో కురిసిన భారీ వానలకు చెరువులు నిండగా, వరినాట్లతో కొంత ఖాళీ అయిన చెరువులు ప్రస్తుతం కురిసిన వానలకు మళ్లీ అలుగులు పారుతున్నాయి.
లోతట్టు జలమయం
జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు ఇప్పటికే అలుగు పారుతుండగా, ఈ వర్షానికి ఉధృతి పెరిగింది. దాంతో లోతట్టు కాలనీలను వరద ముంచెత్తుతోంది. ఇళ్ల ముం దు నుంచి భారీగా వరద ప్రవహిస్తోంది. పలు ఇళ్లలోకి నీరు చేరింది. దిగువన ఉన్న కొత్తగంజి, మడుగునగ ర్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మూడు రో జులు భారీ వర్షాలు ఉన్నాయని వా తావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపఽథ్యంలో వరద ముప్పు పెరిగే ప్రమాదం ఉంది. నాలాల ద్వారా మినీ ట్యాంక్బండ్లోకి భారీగా నీరు చేరుతోంది. లక్ష్మీనగర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. భారీ వర్షంతో చిరువ్యాపారులు దుకాణాలను తెరవలేదు. ఈ వర్షం ఆరుతడి పంటలు పత్తి, కంది పంటలకు మేలు చేకూర్చగా, కోతదశకు వచ్చిన జొన్న పంట దెబ్బతిననుంది.