పూర్తికాని డిస్ట్రిబ్యూటరీ కాల్వలు
ABN , Publish Date - May 11 , 2025 | 11:27 PM
చెంతనే నీరున్నా వాటిని సాగుకు వాడుకోలేని పరిస్థితి నెలకొంది.
- నీళ్లు పారకపాయే.. పరిహారం అందకపాయే
- కేఎల్ఐ నీటికోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు
మిడ్జిల్, మే 10 (ఆంధ్రజ్యోతి) : చెంతనే నీరున్నా వాటిని సాగుకు వాడుకోలేని పరిస్థితి నెలకొంది. మండలంలో కొన్నేళ్లుగా కేఎల్ఐ మెయిన్ కాల్వ పారుతున్నప్పటికీ డిస్ట్రిబ్యూటరీ కాల్వలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో పలు గ్రామాల రైతులకు సాగునీరందక ఏటా ఇబ్బందులు పడుతున్నారు. ఇరిగేషన్ అధికారులు వచ్చి సర్వేలు చేస్తూ వెళ్తున్నారే తప్ప కాల్వ పనులను పూర్తి స్థాయిలో చేపట్టడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాల్వకు సంబంధించి భూములు కోల్పోయే రైతులకు భూమి నష్టపరిహారం చెల్లించకపోవడంతో పనులు అడ్డుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో కొంత మేర కాల్వ తవ్వకాల పనులు చేపట్టినప్పటికీ నీళ్లు రాకపోవడంతో తమ భూమి పోయిన పర్వాలేదు కానీ.. నీళ్లు రాకపాయే తమకు పరిహారం అందకపాయే అని పలువురు భూమి కోల్పోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పెండింగ్లో ఉన్న కాల్వ పనులను వెంటనే పూర్తి చేసి సాగునీరందించాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
పెండింగ్లో ఉన్న కాల్వ పనులు..
కేఎల్ఐ మెయిన్ కాల్వ చిల్వేర్ వద్ద డి-44 కాల్వ రెండు కిలో మీటర్ల మేర పెండింగ్లో ఉంది. డి-46 కాల్వ అయ్యవారిపల్లి, వెలుగొమ్ముల మీదుగా నాగర్కర్నూల్ జిల్లా తాడూర్ మండలం పాపగల్ గ్రామం వరకు 6 కిలో మీటర్లు ఉండగా.. కిలో మీటరు మేర కాల్వను తవ్వి మిగతా పనులు పెండింగ్లో ఉంచారు. డి-48 మిడ్జిల్, కొత్తూర్ గ్రామాల మధ్య అర కిలో మీటర్ పెండింగ్లో ఉంది. డి-49 కాల్వకు 5 కిలో మీటర్ల దూరం ఉండగా కిలో మీటరు కాల్వ గురించి కోర్టు కేసు ఉన్నందున్న పెండింగ్లో ఉంచడం జరిగింది. అదే విధంగా మండలంలోని అయ్యవారిపల్లి, మున్ననూర్, మిడ్జిల్, మల్లాపూర్ గ్రామాల శివారులోని యూటీల నిర్మాణం ఇప్పటి వరకు చేపట్టలేదు.