శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద
ABN , Publish Date - May 30 , 2025 | 11:36 PM
నాగర్కర్నూల్ జిల్లా సరిహద్దులోని శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. వుక్రవారం సుంకేసుల నుంచి 4,345, జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
- జలాశయంలోకి 19 వేల క్యూసెక్కులకు పైగా నీరు
- ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న ఉత్పత్తి
దోమలపెంట/ ఆత్మకూరు, మే 30 (ఆంధ్రజ్యోతి) : నాగర్కర్నూల్ జిల్లా సరిహద్దులోని శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. వుక్రవారం సుంకేసుల నుంచి 4,345, జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పాదన కోసం 17,082 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మెత్తంగా 41,427 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాం వైపునకు వస్తోంది. 19,288 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో 3,617 క్యూసెక్కుల నీటిని ఉపయోగించి 1.579 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఎంజీకేఎల్ఐ కాలువ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. దీంతో శుక్రవారం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడగులకు గాను, 821.90 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామరథ్యం 215.807 టీఎంసీలకు గాను, 42.2774 టీఎంసీల నీటి నిల్వ నమోదు అవుతున్నట్లు గేజింగ్ అధికారులు తెలిపారు. 4,571 స్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో కొనసాగుతుందని చెప్పారు.
ప్రారంభమైన విద్యుత్ ఉత ్పత్తి
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరిధిలోని ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని శుక్రవారం ఉదయం ప్రారంభించినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోందని తెలిపారు. దీంతో ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా ఉత్పత్తి కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దిగువ జూరాల ఉత్పత్తి కేంద్రంలో రెండు యూనిట్లను ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నామని తెలిపారు. జూన్ చివరి మాసంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగా ఎగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 345 మిలియన్ యూనిట్లు, దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 333 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. వరద ఇదే స్థాయిలో కొనసాగితే గత ఏడాది కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.