సుందరీమణుల రాకకోసం..
ABN , Publish Date - May 15 , 2025 | 11:08 PM
ప్రపంచ సుందరీమణుల రాక కోసం పాలమూరు సిద్ధమైంది. మిస్ వరల్డ్-2025 పోటీదారులు ప్రముఖ పర్యాటక క్షేత్రం పిల్లల మర్రికి శుక్రవారం రానుండటంతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. క్షేత్రానికి రంగులు అద్దడంతో పాటు.. ఎటు చూసినా ఆకుపచ్చగా కనిపించేలా తీర్చిదిద్దారు.
నేడు పాలమూరుకు మిస్ వరల్డ్ పోటీదారులు
సర్వాంగ సుందరంగా ముస్తాబైన పిల్లలమర్రి క్షేత్రం
హైదరాబాద్ నుంచి రానున్న 22 మంది
రాజరాజేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి దర్శనం
మహావృక్షం కింద ఫొటోషూట్
మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి వరకు ఆంక్షలు
బాలానగర్ నుంచి 1300 మంది పోలీసులతో మూడంచెల భద్రత
ప్రపంచ సుందరీమణుల రాక కోసం పాలమూరు సిద్ధమైంది. మిస్ వరల్డ్-2025 పోటీదారులు ప్రముఖ పర్యాటక క్షేత్రం పిల్లల మర్రికి శుక్రవారం రానుండటంతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. క్షేత్రానికి రంగులు అద్దడంతో పాటు.. ఎటు చూసినా ఆకుపచ్చగా కనిపించేలా తీర్చిదిద్దారు. ముందుగా 16వ శతాబ్దం నాటి రాజరాజేశ్వరీ ఆలయాన్ని దర్శించుకోనున్న సుందరాంగులు.. ఆ తర్వాత పురావస్తు మ్యూజియాన్ని సందర్శించనున్నారు. 700 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి వృక్షాన్ని చూసి తరించనున్నారు. అనంతరం ఫొటోలకు ఫోజులివ్వనున్నారు. అందమైన భామల రాక నేపథ్యంలో అందరి దృష్టి పాలమూరుపై పడింది.
- మహబూబ్నగర్
మిస్ వరల్డ్-2025 పోటీదారులు పాలమూరులో శుక్రవారం పర్యటించనున్నారు హైదరాబాద్లో జరుగుతున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన నార్త్, సౌత్ అమెరికాకు 22 మంది సుందరీమణులు పట్టణంలోని పిల్లలమర్రిని సందర్శించనుండటంతో ఆ పర్యాటక ప్రదేశానికి ప్రపంచ ఖ్యాతి రానుంది. వారి పర్యటన కోసం అధికార యంత్రాంగం పది రోజుల నుంచి క్షేత్రాన్ని సుందరంగా ముస్తాబు చేస్తోంది. పర్యాటకులను ఆకర్షించేలా కొత్తరూపు సంతరించుకుంటోంది. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచవ్యాపితం చేసే ప్రయత్నంలో భాగంగా పిల్లల మర్రిని సుందరీమణులు సందర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడంతో ఇప్పుడు అందరిచూపు ఈ పర్యాటక ప్రాంతంపై పడింది. పాలమూరు జరూర్ ఆనా అన్న నినాదంతో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు వారు ఇక్కడ ఉండనున్నారు. హైదరాబాద్ నుంచి మూడు ప్రత్యేక ఏసీ బస్సులలో సుందరీమణులు పిల్లలమర్రికి చేరుకుంటారు. దారి పొడవునా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
2 గంటలు ఏం చేయబోతున్నారు?
అందాల భామలు 2 గంటల పాటు పిల్లలమర్రిలో గడిపేందుకు అధికార యంత్రాంగం కార్యక్రమాలను రూపొందించింది. ముందుగా ఇక్కడ రాజరాజేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని వారు దర్శించుకుంటారు.
16వ శతాబ్దం నాటి రాజరాజేశ్వర ఆలయం కృష్ణానది తీరంలోని ఈర్లదిన్నె గ్రామంలో ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణ సమయంలో ఏర్పడిన ముంపుతో ఈ ఆలయాన్ని పరిరక్షించేందుకు 1983లో పిల్లలమర్రి పురావస్తు ప్రదర్శనశాల ప్రాంగణానికి తరలించి, పున:ప్రతిష్ఠించారు. ఇక్కడ పూజలు చేసిన అనంతరం పురావస్తు మ్యూజియాన్ని సందర్శిస్తారు. ఈ మ్యూజియంలో జిల్లాకు చెందిన పలు గ్రామాలు, పట్టణాలలో సేకరించిన శిల్పాలు, శాసనాలు రాతియుగపు పనిముట్లు, హైదరాబాద్ స్టేట్ మ్యూజియం నుంచి సేకరించిన పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అల్వాల్పల్లి, గొల్లతగుడి, పూడూరు, నందివడ్డెమాన్, పాన్గల్, కల్వకోల్ ప్రాంతాలకు చెందిన హిందూ, బౌద్ద, జైన మతాలకు శిల్పాలు భద్రపరిచారు. విజయనగర కుతుబ్సామిల కాలం నాటి ఆయుధాలు, విగ్రహాలు ఉన్నాయి. శాతవాహనుల నుంచి అసఫ్ జాహా రాజుల వరకు ముద్రించిన వెండి, సీసపు, రాగి, బంగారు నాణెలు ప్రదర్శనకు ఉంచారు.
మ్యూజియం తిలకించిన అనంతరం అక్కడినుంచి 700 ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షం పిల్లల మర్రి కిందికి చేరుకుంటారు. వృక్షం చరిత్ర, ఇటీవల చెట్టు ఊడలు నేలకొరిగిన సమయంలో సెలైన్ ట్రీట్మెంట్ ద్వారా తిరిగి ఎలా నిలబెట్టగలిగారు? వంటి విషయాలను వివరించనున్నారు. అక్కడే ఫొటోషూట్ ఉంటుంది. బతుకమ్మలను ఉంచి, వాటి గురించి వివరించనున్నారు. క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్లను ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం అక్కడే స్నాక్స్ తిన్నాక తిరుగు ప్రయాణం కానున్నారు.
సుందరంగా తీర్చిదిద్దుతున్న యంత్రాంగం
అందగత్తెల రాక కోసం పిల్లలమర్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అంతా పచ్చగా కనిపించేలా ల్యాండ్స్కే్పను ఏర్పాటు చేస్తున్నారు. గోడలకు, రెయిలింగ్కు పెయింటింగ్ చేస్తున్నారు. ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఆలయం ప్రాంగణాన్ని ఆకుపచ్చగా మార్చి, మొక్కలు నాటించారు. సందర్శకులు కూర్చునే పగోడాలకు అందంగా పెయింటింగ్ వేయించారు. చెట్టు మొదలుకు రంగులు అద్దారు. మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి వరకు ఉన్న 3 కిలోమీటర్ల రహదారికి ఇరువైపుల చెత్తను తొలగించి, శుభ్రం చేస్తున్నారు. ఐజీ సత్యనారాయణ, ఎస్పీ జానకి బందోబస్తుపై, జిల్లా కలెక్టర్ విజయేందిరబోయి ఏర్పాట్లపై వారం రోజులుగా దృష్టి కేంద్రీకరించారు.
పిల్లలమర్రి రహదారిపై ఆంక్షలు
సుందరీమణుల రాకతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రికి వెళ్లే రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ రూట్లో వాహనాల రాకపోకలను బంద్ చేయనున్నారు. ఈ రూట్లో బోయపల్లి వైపు వెళ్లే వాహనాలన్నీ నగరంలో నుంచే వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 1,000 మంది సివిల్ పోలీసులు, మరో 300 వరకు ఏఆర్ పోలీసులతో మూడంచెల బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరునుంచి బలగాలను నగరానికి తరలించారు. జిల్లా సరిహద్దు అయిన బాలానగర్ నుంచి దారిపొడవునా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక నగరం, ముఖ్యంగా మెట్టుగడ్డ నుంచి మహావృక్షం పిల్లలమర్రి వరకు అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలమర్రిలో సుందరీమణుల చుట్టూ 200 మంది మహిళా పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు. వీరికి బ్లూ కలర్లో సఫారీ సూట్(డ్రెస్ కోడ్) కొనుగోలు చేసి పంపిణీ చేశారు. మరోవైపు ఇదివరకే పోలీ్సశాఖ పిల్లలమర్రి చుట్టూ ఉండే గ్రామాలు, తండాలలో నివాసం ఉంటున్న వారి వివరాలు సేకరించింది. ఆయా ప్రాంతాలపై నిఘాను ఉంచింది. అనుమానితులు, కొత్త వ్యక్తుల కదలికలు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని నమ్మకమైన వ్యక్తులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా కొందరు చుట్టూ గ్రామాలపై నజర్ ఉంచారు. ఎక్కడ ఎలాంటి అనుమానం ఉన్నా అదుపులోకి తీసుకోనున్నారు. మొత్తంగా సుందరీమణులు వచ్చి తిరిగి వెళ్లే వరకు పోలీ్సశాఖ పూర్తి అప్రమత్తతో ఉండనుంది.