భూసేకరణకు రైతులు సహకరించాలి : ఆర్డీవో
ABN , Publish Date - May 30 , 2025 | 11:17 PM
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద కాల్వల కోసం జరుగుతున్న భూసేకరణకు రైతులందరు సహకరించాలని నారాయణపేట ఆర్డీవో రాంచందర్నాయక్ అన్నారు.
- కొడంగల్ తరహాలో నష్ట పరిహారం ఇవ్వాలని రైతుల డిమాండ్
ఊట్కూర్, మే 30 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద కాల్వల కోసం జరుగుతున్న భూసేకరణకు రైతులందరు సహకరించాలని నారాయణపేట ఆర్డీవో రాంచందర్నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దపొర్లలో గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రైతులకు నష్టం జరగకుండా న్యాయమై నష్ట పరిహారం అందిస్తామని అన్నారు. అభిప్రాయాల సేకరణ అనంతరం జిల్లా ఉన్నతాధి కారులతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. భూమికి భూమి ఇవ్వాలని కొందరు రైతులు పేర్కొనగా, ఉద్యోగం ఇవ్వాలని కొందరు, కొడంగల్ తరహాలో నష్ట పరిహారం చెల్లించాలని మరికొందరు డిమాండ్ చేశారు. కొందరేమో భూములు కోల్పోతున్న లిస్టులో తమ పేర్లు లేవని పేర్కొన్నారు. గ్రామ సభలో తహసీల్దార్ చింత రవి, ఇరిగేషన్ ఈఈ సురేష్, వెంకటప్ప, ఆయా గ్రామాల పంచా యతీ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.