పరిశ్రమ స్థాపనను ప్రోత్సహించాలి
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:23 PM
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరిశ్రమల ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు.
మహబూబ్నగర్ కలెక్టరేట్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరిశ్రమల ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖలతో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల శాఖ, మునిసిపల్, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ భాగస్వామ్యంతో పరిశ్రమల ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టి, నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఎలక్ట్రికల్ శాఖకు సంబంధించి పెండింగ్ ఉన్న 3 దరఖాస్తులను క్లియర్ చేయాలన్నారు. టి ఫ్రైడ్ ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి ట్రాక్టర్ అండ్ ట్రైలర్ వాహనాలు ఇద్దరికి, షెడ్యూల్డ్ తెగల వారికి ఒక ట్రాక్టర్, ఒక ట్రైలర్, ఒక మారుతి డిజైర్ వాహనాలకు గాను పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీలో ఆమోదం తెలిపారు. గ్రీన్ ఇండస్ట్రీయల్ సెజ్, పోలెపల్లి సెజ్లో స్ట్రీట్ లైట్లు పాతవాటి స్థానంలో కొత్తవి, రోడ్డు ప్యాచ్ వర్క్ రిపేర్లను జూలై లోగా పూర్తి చేయాలని టీజీఐఐసీ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ప్రతాప్రెడ్డి, ఎల్.డీ.ఎం భాస్కర్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ నాగరాజు, డిప్యూటీ డైరెక్టర్ గణేష్, డీపీవో పార్థసారథి, మోటార్ వేహికిల్ ఇన్స్పెక్టర్ రఘు పాల్గొన్నారు.