పురాతన బావుల సుందరీకరణకు కృషి
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:31 PM
రాష్ట్రంలోని పురాతన బావులు, కోనేరుల సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు హైదరాబాద్కు చెందిన ప్రముఖ అర్కిటెక్ కల్పన అన్నారు.
- ప్రముఖ ఆర్కిటెక్ట్ కల్పన
- మాగనూరు, కృష్ణ, మక్తల్ మండలాల్లోని కోనేర్ల పరిశీలన
మాగనూరు/కృష్ణ/మక్తల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని పురాతన బావులు, కోనేరుల సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు హైదరాబాద్కు చెందిన ప్రముఖ అర్కిటెక్ కల్పన అన్నారు. నారాయణపేట జిల్లా, మాగనూరు, కృష్ణ, మక్తల్ మండల కేంద్రాల్లోని పురాతన కోనేరులను బుధవారం ఆమె సందర్శించారు. మాగనూరులోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద ఉన్న కోనేరును పరిశీలించారు. కృష్ణ మండలంలోని కున్సి, గుడెబల్లూరు, ముడుమాల్ గ్రామాల్లోని వేణుగోపాల స్వామి, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలోని కోనేరులను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి సూచన మేరకు తాను పురాతన కోనేరులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల సహయ సహకారాలతో వాటి సుందరీకరణకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఆయా ఆలయాల్లో పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మాగనూరు మండల అధ్యక్షుడు ఆనంద్గౌడ్, మక్తల్ నాయకులు కట్ట సురేశ్, రవికుమార్, నాయకులు గణేష్కుమార్, రవికుమార్, కల్లూరిగోవర్దన్, బోయ నర్సింహా, ఆలయ కమిటీ అధ్యక్షుడు రమేశ్గౌడ్, పంచాయతీ కార్యదర్శి తిమ్మప్ప, దేవేంద్రప్ప, పురోహితుడు ప్రభు పాల్గొన్నారు.