అర్బన్ ఎకో పార్క్లో రూ.2 కోట్ల అభివృద్ధి పనులు
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:32 PM
నగరంలో అర్బన్ ఎకో పార్కులో ఇటీవల నగర్ వన్ యోజన ద్వారా రూ.2 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డా.సి సువర్ణ అన్నారు.
మహబూబ్నగర్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : నగరంలో అర్బన్ ఎకో పార్కులో ఇటీవల నగర్ వన్ యోజన ద్వారా రూ.2 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డా.సి సువర్ణ అన్నారు. ఆదివారం ఆమె అర్బన్ ఎకో పార్కును సందర్శించారు. బోటింగ్ ప్రదేశం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్క్ అభివృద్ధి, సుందరీకరణ, పునరుద్ధరణ వంటి పనులు సందర్శకుల కోసం చేపట్టామన్నారు. నగర్ వన్ యోజన నిధులతో రూ.70 లక్షలతో రూఫ్టాప్ సోలార్ పవర్ ప్లాంట్, 11 సైకిళ్లు, పిల్లల ఆట పరికరాలు, టైగర్ ఫొటో పాయింట్ పునరుద్ధరణ, మరమ్మతులు, బటర్ ఫ్లై, కరెన్సీ పార్కు పునరుద్దరణ, సుందరీకరణ పనులు చేపడుతున్నారన్నారు. అక్కడ చేపడుతున్న పనులను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా తిలకించారు. అనంతరం పిల్లల మర్రిలో డీర్పార్క్, మినీ జూపార్క్, రాజరాజేశ్వర ఆలయం, మ్యూజియంను సందర్శించారు. మ్యూజియంలో సేకరించిన పురాతన విగ్రహాలు, నాణేలు, వస్తు సామగ్రిని తిలకించారు. కన్జవేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాంబాబు, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, ఎఫ్ఆర్వో ఎండీ అబ్దుల్ పాల్గొన్నారు.