డెత్ స్పాట్
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:35 PM
మండలంలోని అంకిళ్ల పెద్దవాగు వంతెన వద్ద బండలు డెత్ స్పాట్గా మారింది.
- సరదా కోసం వచ్చి యువకుల మృత్యువాత
- నీటిలోతు తెలియక ఇబ్బందులు
- హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వినతి
కోయిలకొండ, అక్టోబర్ 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని అంకిళ్ల పెద్దవాగు వంతెన వద్ద బండలు డెత్ స్పాట్గా మారింది. ప్రతీ వర్షాకాలంలో వాగు అందాలను చూడడానికి సరదాగా వచ్చే పర్యాటకులు వాగులో ఉన్న గుంతలు గుర్తించకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఇదే స్థలంలో మండలంలోని కళ్యాణ్నగర్ తండాకు చెందిన అన్నదమ్ములు సంజు, ప్రవీణ్ పండుగ కోసం గ్రామానికి వచ్చారు. సరదగా అంకిళ్ల పెద్దవాగులో బండ దగ్గర వాగులో దిగి గుంత తెలియక నీటిలో మునిగి మృతి చెందారు. తాజాగా జిల్లా కేంద్రానికి చెందిన కుమ్మరి శేఖర్ కుటుంబ సభ్యులతో కలసి విహారానికి వచ్చి వాగులో గుంతల విషయం తెలియక నీటిలో మునిగి మృతి చెందారు. అంకిళ్ల వాగు వద్ద వంతెన కింద వేసవి కాలం వరకు నీరు నిలిచి ఉండటంతో ఇతర ప్రాంతాల పలువురు ఇక్కడకు వచ్చి సరదాగా గడుపుతూ మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు స్పందించి అంకిళ్ల వాగు బండల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.