ఆధార్ కార్డులు లేవని పరిహారం ఇస్తలేరు
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:03 PM
ఆధార్ కార్డులు లేవని, ఇతర గ్రామాలలో ఉంటున్నారని సాకు చూపుతూ దాదాపు 500 మందికి పరిహారం అందకుండా చేస్తున్నారు. 2021 నాటికే కటా్ఫతో ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన 256 మందికి అన్యాయం జరుగుతోంది.
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితతో ఉదండాపూర్ నిర్వాసితులు
జడ్చర్ల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : ‘ఆధార్ కార్డులు లేవని, ఇతర గ్రామాలలో ఉంటున్నారని సాకు చూపుతూ దాదాపు 500 మందికి పరిహారం అందకుండా చేస్తున్నారు. 2021 నాటికే కటా్ఫతో ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన 256 మందికి అన్యాయం జరుగుతోంది. నోటిఫికేషన్ జారీ చేసిన నాటికి అవార్డు పాసుకానందున, నేటి విలువ ఆధారంగా పరిహారం ఇవ్వాలి. ముంపు గ్రామాలలో స్ట్రక్చర్ విలువతో పాటు పునరావాసం పరిహారం సైతం నేటి విలువ ఆధారంగానే ఇవ్వాలి’ అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజ్టెకులోని ఉదండాపూర్ రిజర్వాయర్లో నిర్వాసితులు, ముంపు గ్రామాల వాసులు వివరించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను కవిత పరిశీలించారు. అనంతరం రిజర్వాయర్లో భూములు, గ్రామాలు కోల్పోతున్న నిర్వాసితులను కలిశారు. ఈ సందర్బంగా రిజర్వాయర్తో ఇబ్బందులకు గురవుతున్న అంశాలను కవిత నిర్వాసితులు కృష్ణ, శ్రీను, హన్మంతు, రామకృష్ణ, రామాజంనేయులు ఏకరువు పెట్టారు. పునరావాసం కింద కుటుంబానికి రూ.16.30 లక్షల పరిహారం ఇస్తున్నారన్నారు. రూ.25 లక్షలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే మాట ఇచ్చాడని, ఇచ్చిన మాట ప్రకారం పరిహారం అందుతుందా అనే అంశంలో స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ జారీ చేసిన రోజు అవార్డు(డబ్బులు) ఇవ్వలేదని వివరించారు. అవార్డు పాస్ చేసిన రోజు నాటి విలువ ఆధారంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. నిర్వాసితుల డిమాండ్లకు అనుగుణంగానే తాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కవిత వెల్లడించారు. 2021 కటా్ఫగా తీసుకోకుండ 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భూములు కోల్పోయిన వారికి ఎకరాకు రూ.25 లక్షలు, అలాగే పునరావాసం కింద కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల మండలం కుర్వగడ్డపల్లి గ్రామ సమీపంలోని దుందుభీ నది పరివాహక ప్రాంతంలోని పరుషవేదీశ్వరస్వామి దేవాలయంలో పూజలు చేశారు.