పేరుకే బీటీ.. మొత్తం గోతులే
ABN , Publish Date - May 29 , 2025 | 11:07 PM
మండలంలోని పలు గ్రామాల బీటీ రోడ్లపై వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు.
ప్రయాణానికి నిత్యం నరకయాతనే
పట్టించుకోని అధికారులు
మిడ్జిల్, మే 29 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పలు గ్రామాల బీటీ రోడ్లపై వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. మండలంలోని రాణిపేట నుంచి వస్పుల, దోనూర్, సింగందొడ్డికి వెళ్లే బీటీరోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాణిపేట నుంచి అయ్యవారిపల్లి గ్రామానికి వెళ్లే బీటీరోడ్డుపై రైతులు వ్యవసాయ పొలాలకు సాగునీటిని తీసుకెళ్లేందుకు రోడ్డుపై కాల్వతీసి పైప్లైన్ నిర్మాణాలు చేపట్టడంతో బీటీరోడ్డుపై గోతులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వర్షాకాలంలో గోతులలో నీరు నిలిచి పలు మార్లు ద్విచక్ర వాహనదారులు కిందపడి ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీనికి తోడు రాణిపేట నుంచి సింగందొడ్డి వరకు బీటీరోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడంతో చిన్నచిన్న గోతులు సైతం వర్షాలకు పెద్దవిగా మారాయి. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి రోడ్లపై ఏర్పడిన గోతులను సరిచేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.