సరిహద్దులో ‘బోనస్’ దందా
ABN , Publish Date - May 09 , 2025 | 11:19 PM
వరి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బుల కోసం కొందరు ధాన్యం కేంద్రాల నిర్వాహకులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు.

- తెలంగాణలోకి అక్రమంలో కర్నాటక ధాన్యం
- సొమ్ము చేసుకుంటున్న ధాన్యం కేంద్రాల నిర్వాహకులు
- కొత్తపల్లిలో 500 బస్తాల ధాన్యం గుర్తింపు
- జిల్లా అధికారులకు విన్నవించిన తహసీల్దార్, ఐకేపీ అధికారులు
గద్వాల, మే 9 (ఆంధ్రజ్యోతి): వరి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బుల కోసం కొందరు ధాన్యం కేంద్రాల నిర్వాహకులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. జిల్లాలోని మార్కెట్లో కొనుగోలు చేసిన ధాన్యంను కేంద్రాలకు తరలించి రైతుల పేరుతో మళ్లీ విక్రయిస్తున్నారు మరికొందరు కర్నాటక ధాన్యాన్ని కొనుగోలు చేసి సరిహద్దు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక్కడి నిర్వాహకులకు కొందరు రైతులు కూడా సహకరిస్తుండడం గమనార్హం.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 68,896 ఎకరాల్లో వరిసాగు చేశారు. దాదాపు 2.20లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అందులో 1.37లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఇందుకోసం 69 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా దాదాపు 65 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 29వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.
కేంద్రాల్లోకి రాత్రివేళ ధాన్యం తరలింపు
ప్రభుత్వం మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తుండటంతో రైతులు ఎక్కువగా సన్నాలను మాత్రమే పండిస్తున్నారు. మద్దతు ధర రూ.2300 లతోపాటు మరో రూ.500బోనస్ వస్తుండటంతో క్వింటాకు రూ.2800 రైతులు పొందుతున్నారు. కర్నాటకలో క్వింటా రూ.1900ల నుంచి రూ.2000 వరకు ధర పలుకుతున్నది. దీంతో రాయిచూర్ బార్డర్లోని కొనుగోలు కేంద్రాలకు కర్నాటక నుంచి ధాన్యాన్ని తీసుకువస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి సెంటర్ నిర్వాహకులు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంకటాపురంతో పాటు దాని పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో యథేచ్ఛ్చగా సాగుతుందని అంటున్నారు. అలాగే గద్వాల వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని స్థానికంగా ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి రాత్రివేళ తరలిస్తున్నారు. కొందరు రైతులు బాకీ డబ్బులు చెల్లించేందుకు, త్వరగా విక్రయాలు చేసుకోవడానికి గద్వాల మార్కెట్లో మద్దతు ధరకంటే తక్కువ ధరకే సన్నాలను విక్రయిస్తున్నారు. ఈ ధాన్యాన్ని అక్రమార్కులు ధాన్యం కేంద్రాలకు తరలించి, బినామీ రైతుల పేరుతో సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
కొత్తపల్లి సెంటర్లో 500 బస్తాలు గుర్తింపు
గద్వాల మండలం కొత్తపల్లి కొనుగోలు కేంద్రంలో ఓ రైతు, కేంద్రం నిర్వాహకులతో కుమ్మక్కై దాదాపు 500 బస్తాలను విక్రయిస్తున్నాడు. దీనిని గుర్తించిన రైతులు అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఐకేపీ, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు విచారించారు. అప్పటికే దాదాపు 140సంచులు కాంటా కాగా మిగిలిన ధాన్యాన్ని నిలుపుదల చేశారు. రైతును విచారించగా తాను గత ఏడాది పండించిన పంటతోపాటు కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులో ఉంచానని, ఇప్పుడు విక్రయించడానికి తెచ్చానని బదులివ్వడంతో నిల్వచేసిన రైస్మిల్లులో అధికారులు విచారించారు. మా దగ్గర ఏరైతు నిల్వ చేయలేదని తేలడంతో అదే విషయాన్ని అదనపు కలెక్టర్కు నివేదికను అందించారు. దీంతో ప్రస్తుతం కొనుగోలు నిలిచిపోయాయి. ఈ విషయంపై అధికారులు సీరియస్గా ఉన్నారు. ఇంకా ఎన్నిసెంటర్లలో ఇలాంటి వ్యవహారం జరుగుతున్నదో అని ఆరా తీస్తున్నారు. ఐకేపీ, వ్యవసాయ విస్తరణ అధికారుల పాత్రపై విచారణ చేస్తున్నారు. బోనస్ కోసం అక్రమ మార్గంలో ధాన్యం తెచ్చిన రైతులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.