Share News

డిజిటలైజేషన్‌పై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - May 30 , 2025 | 11:34 PM

నేటి వార్తా ప్రపంచం డిజిటలైజేషన్‌ వైపు వేగంగా అడుగులు వేస్తోందని, అందుకు అనుగుణంగా పాత్రికేయులు అవగాహన పెంపొందించుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి అన్నారు.

డిజిటలైజేషన్‌పై అవగాహన పెంచుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస రెడ్డి, పక్కనే కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌

- హైదాబాద్‌లో పాత్రికేయులకు కంప్యూటర్‌ శిక్షణ

- మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి

మన్ననూర్‌, మే 30 (ఆంధ్రజ్యోతి) : నేటి వార్తా ప్రపంచం డిజిటలైజేషన్‌ వైపు వేగంగా అడుగులు వేస్తోందని, అందుకు అనుగుణంగా పాత్రికేయులు అవగాహన పెంపొందించుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి అన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో నాగర్‌కర్నూలు జిల్లా, అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూరు పర్యాటక వనమాలిక ఆవరణలో రెండు రోజుల పాటు నిర్వహించిన పాత్రికేయుల శిక్షణా తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సిఫారసులను అమలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అధికార యంత్రాంగం చేపట్టే అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఎస్పీ వైభవ్‌ రఘునాథ్‌ గైక్వాడ్‌ మాట్లాడుతూ నిజమైన జర్నలిస్టులకు గుర్తింపు ఇచ్చేందుకు పోలీస్‌ శాఖ ద్వారా ఐడీ కార్డులను అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన పాత్రికేయులకు ధ్రువీకరణ పత్రాలను అందించారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్‌రావు, సంపాదకుడు ఉడుముల సుధాకర్‌రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు భావ నారాయణ, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌ రెడ్డి, స్థానిక విలేకరులు రాములు, సాయిబాబా, శ్రీధర్‌, లక్ష్మీపతి, కొండయ్య, ప్రకాశ్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:34 PM