పథకాల వినియోగంపై.. అవగాహన కల్పించాలి
ABN , Publish Date - May 27 , 2025 | 10:53 PM
పేదలకు కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వినియోగంపై క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మహబూబ్నగర్ ఎంపీ, దిశ(జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) చైర్పర్సన్ డీకే అరుణ అధికారులకు సూచించారు. ఆ బాధ్యత జిల్లా అధికారులపై ఉందని చెప్పారు.
దిశ కమిటీ సమావేశంలో ఎంపీ డీకే అరుణ
మహబూబ్నగర్ కలెక్టరేట్, మే 27(ఆంధ్రజ్యోతి): పేదలకు కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వినియోగంపై క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మహబూబ్నగర్ ఎంపీ, దిశ(జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) చైర్పర్సన్ డీకే అరుణ అధికారులకు సూచించారు. ఆ బాధ్యత జిల్లా అధికారులపై ఉందని చెప్పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి దిశ సమావేశాన్ని నిర్వహించారు. అరుణ అధ్యక్షత వహించి, మాట్లాడారు. పథకాలు కేంద్రానివి అయినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నవి అయినా నిబంధనల మేరకు అమలు చేయాలన్నారు. సిఫారసులను పట్టించుకోవద్దని సూచించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 252 యూనిట్లకు రూ.72.20 లక్షలు కేటాయించినట్లు వ్యవసాయ అధికారి మధుసూదన్ గౌడ్ తెలిపారు. జాతీయ ఆయిల్ సీడ్ మిషన్ కార్యక్రమం కింద వంట నూనెల ఉత్పత్తికి జిల్లాలో 1,250 ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేందుకు రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా రెండు సంస్థలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అరుణ మాట్లాడుతూ ప్రత్యమ్నాయ పంటల సాగు కింద డిమాండ్ ఉన్న వేరుశనగ ద్వారా నూనె ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చి రైతులను ప్రోత్సహించాలన్నారు. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకునేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. గొర్రెల యూనిట్ ధర రూ.కోటి అంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు వినియోగంగా ఉండదని, యూనిట్ ధరను రూ.25 లక్షలకు తగ్గించాలని సూచించారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్పై సమీక్ష చేశారు. అటవీశాఖ జింకల పార్కు అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టు రూపొందించి, సీఆర్ నిధులతో చేపట్టాలన్నారు. బ్యాంకర్లు ఎంఎ్సఎంఈ, పీఎంఎ్ఫఈ పథకాలకు రుణ సహాయం అందించాలని కోరారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను భూమిలేని నిరుపేదలకు కేటాయించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.