సామగ్రి పంపిణీలో తప్పులు జరగొద్దు
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:41 PM
పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేసేటప్పుడు బ్యాలెట్ పేపర్లను ఆర్వోలు తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
- వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
పాన్గల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేసేటప్పుడు బ్యాలెట్ పేపర్లను ఆర్వోలు తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. వనపర్తి జిల్లా పాన్గల్ ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఎన్నికల సాధారణ పరిశీలకుడు మల్లయ్యభట్టు, అదనపు కలెక్టర్ యాదయ్య ఆర్వోలతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థుల గుర్తులు అన్ని ఉన్నాయో లేదో చెక్ చేసిన తర్వాతే సిబ్బందికి పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ బయట అతికించే ఫారం-9 వివరాలు సక్రమంగా రాసి అతికించాలన్నారు. ఈ రెండు విషయాల్లో పొరపాటు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏమైనా సందేహాలు ఉంటే ఉన్నతాధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు.