Share News

దరఖాస్తులకు పరిష్కారం చూపాలి

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:18 PM

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.

దరఖాస్తులకు పరిష్కారం చూపాలి
ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

- కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 123 ఫిర్యాదులు రాగా, ప్రతీ దరఖాస్తును నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్‌, ఏనుగు నరసింహారెడ్డి, జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, ఆర్డీవో నవీన్‌ పాల్గొన్నారు.

చర్యలు తీసుకోవాలి...

రాష్ట్రంలోని లంబాడీల మనోభావాలు కించపరిచే విధంగా అసత్య ఆరోపణలు చేస్తూ మీరు ఎస్టీలు కాదదని ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లంబడా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చైర్మన్‌ అంతిరామ్‌నాయక్‌, కో చైర్మన్‌ నారాయణనాయక్‌, సభ్యులు శేఖర్‌నాయక్‌, లక్ష్మణ్‌నాయక్‌, రాజునాయక్‌, రామునాయక్‌, రవిరాథోడ్‌ ఉన్నారు.

ఉర్ధూఘర్‌ మరో చోట నిర్మించాలి..

జిల్లా కేంద్రంలో నిర్మించనున్న ఉర్ధూఘర్‌ మరో చోట నిర్మించాలని కోరుతూ అంబేడ్కర్‌ భవన పరిరక్షణ (జేఏసీ) ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో చైర్మన్‌ పరమేశ్వర్‌, కన్వీనర్‌ రమేష్‌, అశోక్‌, నర్సింహులు, రమేష్‌ ఉన్నారు.

అధికారులు న్యాయం చేయాలి..

102/2 సర్వే నెం, భూమి నందు దౌర్జన్యంగా ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో ఎస్‌. దివ్వజ్యోతి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వినతిలో పేర్కొన్నారు.

మైనార్టీ గురుకుల పాఠశాల భవనం పరిశీలన

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : బోయపల్లి గేట్‌ వద్ద నిర్మిస్తున్న మైనార్టీ గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులన కలెక్టర్‌ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల భవనంలో డార్మిటరీ, కిచెన్‌, పోస్టు మెట్రిక్‌ హాస్టల్‌ భవన నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల 15లోపు పూర్తి చేయాలని అదేశించారు. మైనార్టీ సంక్షేమశాఖ అధికారి శంకరాచారి, తెలంగాణ గురుకుల విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ ఈఈ రాంచందర్‌ పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన ఉండాలి

ట్రాఫిక్‌ నియమాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పంచవటి విద్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ నిబంధనల అవగాహన పార్కును కలెక్టర్‌ పరిశీలించారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు అధికారి ఎంవీ రఘుకుమార్‌, మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ వాసుదేవరావు, ప్రిన్సిపాల్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 11:18 PM