నిర్లక్ష్యం చేస్తే చర్యలు
ABN , Publish Date - May 14 , 2025 | 11:11 PM
‘మీకు ఎన్ని సార్లు చెప్పాలి.. పనిమీద దృష్టి పెట్టలేరా..
- లాస్ట్ టైం చెప్పినా పురోగతి లేదు
- బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే చర్యలు
- అభివృద్ధి పనుల సమీక్షలో కలెక్టర్ ఆగ్రహం
వంగూరు, మే 14, (ఆంధ్రజ్యోతి): ‘మీకు ఎన్ని సార్లు చెప్పాలి.. పనిమీద దృష్టి పెట్టలేరా.. లాస్ట్ టైమ్ చెప్పినా అభివృద్ధి పనుల్లో పురోగతి లేదు. సెప్టెంబరు 15 నాటికి పనులు పూర్తికావాలి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు’ అని నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను హెచ్చరించారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిని బుధవారం ఆయన పరిశీలించారు. గ్రామపంచాయతీ భవనంలో సంబందిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో రెండు వరుసల రహదారి, పాలశీతలీకరణ నూతన భవన నిర్మాణం, ప్రతీ ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించే పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలో గ్రామంలోని అభివృద్ధి పనులన్నింటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులను ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, సంబందిత శాఖల అధికారులతో కలసి పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట వ్యవ సాయ సంక్షేమ కమిషన్ సభ్యుడు కేవీఎన్రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్లు, గ్రామాభి వృద్ధి ప్రత్యేక అధికారి విజయకుమార్, ఆర్ఆండ్బీ అధికారులు ఉన్నారు.