ఆర్అండ్బీ రోడ్లకు మహర్దశ
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:11 PM
రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. పాత పద్ధతుల్లో కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని కొత్త పద్ధతిలో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించింది.
ఉమ్మడి జిల్లాలో హ్యామ్ కింద 660.01 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి
40 శాతం నిధులు ముందు విడుదల, వడ్డీతో సహా 60 శాతం 15 ఏళ్లు చెల్లింపు
రెండు సర్కిళ్ల పరిధిలో రూ. 833.53 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు
డబుల్ లేన్ల నిర్మాణంతో పాటు ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడమే లక్ష్యం
పాలమూరు సర్కిల్లో 26 రోడ్లు, వనపర్తి సర్కిల్లో 15 రోడ్లు మంజూరు
మహబూబ్నగర్, జూలై 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. పాత పద్ధతుల్లో కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని కొత్త పద్ధతిలో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించింది. సాధారణంగా ఇంజనీరింగ్- ప్రొక్యూర్మెంట్- కన్స్ట్రక్షన్ (ఈపీసీ), బిల్డ్- ఆపరేట్- ట్రాన్స్ఫర్ (బీవోటీ) విధానాల్లో గతంలో పనులు చేపట్టేవారు. వీటిలో ఈపీసీ విధానం ద్వారా అయితే ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుంది. బీవోటీ విధానం ద్వారా కాంట్రాక్టు సంస్థనే వ్యయం భరించి తర్వాత టోల్గేట్ల ద్వారా వాహనదారుల నుంచి అగ్రిమెంట్ ప్రకారం వసూలు చేసుకుంటుంది. ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వంపై భారం వేసేలా ఆర్థిక పరిస్థితులు లేవు. బీవోటీ విధానం జాతీయ, రాష్ట్ర రహదారుల్లో మాత్రమే అమలు చేస్తున్నారు. ఆర్అండ్బీ రోడ్లకూ వసూలు చేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైబ్రీడ్ యాన్యూనిటీ మోడ్ (హ్యామ్) పద్ధతిలో రోడ్లను నిర్మాణం చేయనుంది. దీనిప్రకారం టెండర్ దక్కించుకున్న సంస్థకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు చెల్లిస్తుంది. మిగతా 60 శాతం నిధులు కాంట్రాక్టు సంస్థనే భరించాలి. ఆ తర్వాత 15 ఏళ్లపాటు 60శాతం వ్యయానికి కొంత వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు చెల్లిస్తుంది. ఈ పద్ధతిలో రోడ్ల నిర్మాణం ద్వారా అటు ఖజానాపై అధిక భారం పడదు. అదే సమయంలో టోల్గేట్లు పెట్టాల్సిన అవసరం ఉండదు.. రోడ్ల అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు సర్కిళ్లు ఉండగా ఈ రెండు సర్కిళ్ల పరిధిలో 41 రోడ్లను హ్యా మ్ విధానంలో తొలిదశలో మంజూరు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగా త్వరలోనే టెండర్లు పూర్తి చేస్తామని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు.
మంజూరైన రోడ్లు ఇవే..
ఉమ్మడి పాలమూరు జిల్లాను గతంలోనే రెండు ఆర్అండ్బీ సర్కిళ్లుగా విభజించారు. వాటి పరిధి మేరకే ఇప్పుడు హ్యామ్ రోడ్ల అభివృద్ధి జరగనుంది. మహబూబ్నగర్ జిల్లాలో 175.69 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతు చేయనుండగా నారాయణపేట జిల్లా పరిధిలో 91.96 కిలోమీటర్లు, జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 120.09 కిలోమీటర్లు, వనపర్తి జిల్లాలో 110.53 కిలోమీటర్లు, నాగర్కర్నూలు జిల్లాలో 160.60 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. వీటికి రూ. 833.53 కోట్లు ఖర్చు కానుంది. గద్వాల జిల్లాలో ఎర్రిగెర- అయిజ-అలంపూర్, గద్వాల- రంగాపూర్, గద్వాల- అయిజ, తుంగభద్ర బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు, మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్- మున్ననూరు రోడ్డు, మహబూబ్నగర్- నవాబుపేట రోడ్డు, మహబూబ్నగర్- చించోలి రోడ్డు, వేపూరు జడ్పీ రోడ్డు (గుండ్యాల స్టేజ్), దేవరకద్ర పీడబ్ల్యూ రోడ్డు- కురుమూర్తి టెంపుల్, రాయిచూర్ పీడబ్ల్యూడీ రోడ్డు (కోడూరు స్టేజ్), జడ్చర్ల రైల్వేస్టేషన్- కొత్త మొల్గర రోడ్డు, రాజాపూర్- తిరుమలాపూర్, కోయిల్కొండ ఆర్అండ్బీ రోడ్డు (మైసమ్మ టెంపుల్), జడ్చర్లలోని గాంధీ విగ్రహం నుంచి మాచారం, రాయచూర్ పీడబ్ల్యూడీ రోడ్డు (ఎనుగొండ), మరికల్- మహ్మదాబాద్ రోడ్డు, నారాయణపేట జిల్లాలోని మరికల్- మినా్సపూర్ రోడ్డు, మక్తల్- నారాయణపేట రోడ్డు, మక్తల్ బ్రాంచ్ రోడ్డు- కృష్ణారోడ్డు, ఆత్మకూరు- మరికల్ రోడ్డు, నాగర్కర్నూలు జిల్లాలోని వనపర్తి- జడ్చర్ల రోడ్డు, మహబూబ్నగర్- మన్ననూరు రోడ్డు, బల్మూరు- నాగర్కర్నూలు పీడబ్ల్యూడీ రోడ్డు, అచ్చంపేట- రాకొండ (వయా ఉప్పునుంతల) రోడ్డు, పెంట్లవల్లి క్రాస్ రోడ్డు- వనపర్తి (వయా శ్రీరంగాపూర్), అమ్రాబాద్- ఇప్పలపల్లి రోడ్డు, వనపర్తి జిల్లాలోని వనపర్తి- జడ్చర్ల రోడ్డు, వనపర్తి- ఆత్మకూరు రోడ్డు, ఆత్మకూరు- మరికల్ రోడ్డు, పెంట్లవల్లి క్రాస్ రోడ్డు- శ్రీరంగాపూర్ (వయా కొండూరు), వనపర్తి- బుద్ధారం రోడ్డు, చిన్నంబావి- చెల్లెపాడు రోడ్డును అభివృద్ధి చేయనున్నారు.
రూ. 833.53 కోట్ల వ్యయం
హ్యామ్ తొలిదశ కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 41 రోడ్లు ఎంపిక కాగా మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలోని మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట జి ల్లాలో 26 రోడ్లు, వనపర్తి సర్కిల్ పరిధిలోని వనపర్తి, నాగర్కర్నూలు జిల్లాల్లో 15 రోడ్లు అభివృద్ధి కానున్నాయి. మొత్తం 660.01 కిలోమీటర్ల మేర ఈ రోడ్లను మొదటి దశలో చేపట్టనుండగా ఇందులో సింగిల్ లేన్గా ఉన్న రోడ్లు డబుల్ లేన్ గానూ ఇప్పటికే ఉన్న రోడ్లు మరమ్మతుల్లో ఉంటే వాటిని అభివృద్ధి చేయనున్నారు. మొత్తం రెండు సర్కిళ్లకు కలిపి రూ. 833.53 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు వేయగా ఇందులో మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలోని 26 రోడ్లకు రూ. 434.19 కోట్లు, వనపర్తి సర్కిల్ పరిధిలోని 15 రోడ్లకు 399.34 కోట్లను కేటాయించారు. వనపర్తి సర్కిల్ పరిధిలో మొత్తం 271.13 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయనుండగా 44.40 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ రోడ్లను నిర్మిస్తారు. మిగతా 226.73 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేస్తారు. మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో 389.15 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయనుండగా ఇక్కడ డబుల్ లైన్ రోడ్లు లేవు. మొత్తం రోడ్ల అభివృద్ధి కోసమే ఖర్చు చేయనున్నారు.