12నుంచి లక్ష్మీతిరుపతమ్మ గోపయ్యస్వామి జాతర
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:58 PM
మండల పరిధిలోని చీదేళ్ళ గ్రామంలో ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు లక్ష్మీతిరుపతమ్మ గోపయ్యస్వామి జాతర ప్రారంభం కానుంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి తరలిరానున్న భక్తులు
ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు
ఆలయం ముస్తాబు
పెన్పహాడ్, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని చీదేళ్ళ గ్రామంలో ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు లక్ష్మీతిరుపతమ్మ గోపయ్యస్వామి జాతర ప్రారంభం కానుంది. జాతరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోల్లో ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్యస్వాముల తరహాలోనే ఇక్కడ కూడా వేలాది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. పెనుగంచిప్రోలు వెళ్లలేని భక్తులు చీదేళ్ళ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్యస్వాముల జాతరకు వస్తారు. 46సంవత్సరాల క్రితం వెలిసిన నాటి నుంచి ప్రతి ఏడాది జాతరకు వచ్చే భక్తులకు కోరిన కోర్రెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందినదని భక్తుల విశ్వాసం. అదేవిధంగా వేలాది మంది భక్తులు వచ్చి ముడుపులు చెల్లిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. 12వ తేదీ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అమ్మవారి ఊరేగింపు, 13వ తేదీన ప్రభ బండ్లు, బోనాలతో ఊరేగింపుతో భక్తులు మొక్కులు తీర్చుకోనున్నారు. 14వ తేదీన తెలుగు రాష్ట్రాల స్థాయి మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. తంగెళ్ళగూడెంలో అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. రాత్రి డ్యాన్స్బేబీ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహిస్తారు. 15వ తేదీ చెట్లముకుందాపురం గ్రామంలో అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. భక్తులకు మెట్ల శివరాం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 16వ తేదీ రామన్నగూడెం చిన్న సీతారాంతండాలో ఊరేగింపు, మహిళా కబడ్డీ ఫైనల్ పోటీలు ఉంటాయి. 17వ తేదీన శ్రీలక్ష్మీ తిరుపతమ్మ గోపయ్యస్వామి వారి కల్యాణ మహోత్సవం, చంద్రపట్టణం ఉంటుంది. జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పరెడ్డి సీతారాంరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మోదుగు నర్సిరెడ్డి, వైస్ చైర్మన్ దేశగాని రాజీవ్గాంధీ, కోశాదికారి జాల సైదులు, కార్యదర్శులు గొట్టిపర్తి గోవింద్, కొండమీది పిచ్యయ్య తెలిపారు. భక్తులకు అసౌకర్యం లేకుండా చూస్తామని వారు పేర్కొన్నారు.