KTR: ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:04 AM
వారితో రాజీనామాలు చేయించి.. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. అలా చేయని పక్షంలో పార్టీ ఫిరాయింపుల గురించి, పార్టీ మారిన వెంటనే అనర్హులను చేసేలా రాజ్యాంగ సవరణ చేస్తామన్న ప్రచారాన్ని మానేయడం మంచిదని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి
రాహుల్ను ఉద్దేశించి ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ వ్యాఖ్యలు
సీసీఐని తుక్కుగా అమ్మడం ప్రజలను వంచించడమేనని ధ్వజం
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజా తీర్పు కోరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వారితో రాజీనామాలు చేయించి.. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. అలా చేయని పక్షంలో పార్టీ ఫిరాయింపుల గురించి, పార్టీ మారిన వెంటనే అనర్హులను చేసేలా రాజ్యాంగ సవరణ చేస్తామన్న ప్రచారాన్ని మానేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీని ఉద్దేశించి మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడడం దుర్మార్గమని, ఇది ఆదిలాబాద్ ప్రజలను వంచించడమేనని విమర్శించారు. బీజేపీ అంటే నమ్మకం కాదు... అమ్మకం అని ఆరోపించారు. కాగా, ఎండిపోతున్న పంటలకు సాగు నీరు విడుదల చేయకపోతే మంత్రి ఉత్తమ్ కార్యాలయం ముట్టడిస్తామన్న తమ హెచ్చరికలతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించిందని కేటీఆర్ తెలిపారు. మిడ్మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్లోకి నీటి విడుదలకు చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.