Krishna River Projects Overflow: మళ్లీ తెరుచుకున్న సాగర్ గేట్లు..
ABN , Publish Date - Aug 11 , 2025 | 05:08 AM
విస్తారంగా కురుస్తున్న వానలతో కృష్ణా నది పోటెత్తుతోంది. ఎగువన ఆల్మట్టి నుంచి దిగువన నాగార్జునసాగర్
నిండుకుండల్లా కృష్ణా ప్రాజెక్టులు.. ఆల్మట్టి నుంచి సాగర్ దాకా గేట్లు ఓపెన్
అన్ని చోట్లా జల విద్యుదుత్పత్తి
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు.. 2 జిల్లాల్లో కాల్వలకు గండ్లు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): విస్తారంగా కురుస్తున్న వానలతో కృష్ణా నది పోటెత్తుతోంది. ఎగువన ఆల్మట్టి నుంచి దిగువన నాగార్జునసాగర్ దాకా ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి. ఎగువ నుంచి భారీగా ప్రవాహాలు కొనసాగుతుండటంతో మొత్తం అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అందులో ఆదివారం జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో ఎనిమిది చొప్పున గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రస్తుత సీజన్లో సాగర్ గేట్లు ఎత్తడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కృష్ణాలో ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి నీటిని వదులుతున్నారు. ఆదివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టుకు 90 వేల క్యూసెక్కులు, శ్రీశైలానికి 1.97 లక్షల క్యూసెక్కులు, సాగర్కు 65,842 క్యూసెక్కుల వరద నమోదైంది. ఎగువ నుంచి విడుదల చేసే నీటికి అనుగుణంగా జలాశయాలకు ఇన్ఫ్లో మారుతుంది. ఇక నది పరీవాహకం పొడవునా విద్యుత్ కేంద్రాల్లో జల విద్యుదుత్పత్తి కొనసాగుతుండటం గమనార్హం. ఎగువ పరీవాహక ప్రాంతాలతోపాటు హైదరాబాద్లో కొనసాగుతున్న వర్షాలతో మూసీ నదిలో వరద పెరుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంగెం, బొల్లెపల్లి గ్రామాల మధ్య కల్వర్టుపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.

దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వానలు
ఆదివారం దక్షిణ తెలంగాణలోని పలు ప్రాం తాల్లో ఓ మోస్తరు వానలు కురిశాయి. నారాయణపేట జిల్లా కోస్గిలో 6.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మద్దూర్లో నివాస ప్రాంతాలు నీటమునిగాయి. వనపర్తి జిల్లాలో కేశంపేట వాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు కాలినడకన వాగు దాటి వెళ్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూ రు, ధారూరు, బొంరా్సపేట్, కోట్పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. బషీరాబాద్ మండలంలోని నవాంద్గీ పెద్ద చెరువు కట్టకు గండిపడింది. మండలంలో మూడు ఇళ్లు కూలిపోయా యి. వికారాబాద్ శివారెడ్డిపేట చెరువు అలుగు పారింది. వాగులు ఉప్పొంగుతున్నాయి. దీనితో ఈసీ, మూసీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నా యి. హిమాయత్సాగర్, గండిపేట జలాశయాల్లోకి భారీగా వరద వస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం అర్ధరాత్రి తర్వాత కురిసిన వర్షాలతో పలు కాలనీలు నీటమునిగాయి. హయత్నగర్లో విజయవాడ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. ఆదివారం ఉప్పల్, రామంతాపూర్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో స్వల్ప వర్షం పడింది.
రెండు జిల్లాల్లో కాలువలకు గండ్లు
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి వద్ద ఎన్నెస్పీ కాల్వకు గండి పడింది. నీరంతా పక్కనే ఉన్న పొలాల్లోకి ప్రవహించింది. 20 ఎకరాలకుపైగా వరి నీటమునిగింది. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ రెవెన్యూ శివారు పరిధిలో కేఎల్ఐ డీ-82 ప్రధాన కాల్వకు శనివారం అర్ధరాత్రి గండి పడింది. పక్కనే ఉన్న పొలాల్లో ఇసుక మేటలు పేరుకున్నాయి.