Krishna Mohan Rao: బీసీ రిజర్వేషన్లు కోర్టుల ద్వారానే సాధ్యం
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:04 AM
బీసీ రిజర్వేషన్ల అసలు పోరాటం కోర్టుల ద్వారానే సాధ్యం అని, రాజకీయ నాటకాలతో కాదు అని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు.
ఏఐసీసీ దృష్టిలో పడేందుకే ఢిల్లీలో ధర్నా : వకుళాభరణం
పంజాగుట్ట, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల అసలు పోరాటం కోర్టుల ద్వారానే సాధ్యం అని, రాజకీయ నాటకాలతో కాదు అని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ఢిల్లీలో ధర్నా బీసీల కోసం కాదు, రాజకీయ హంగామా కోసమేనని ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకంగా ఒక రిట్ ఆఫ్ మాండమస్ వేసి, సుప్రీంకోర్టు ద్వారా బిల్లులపై త్వరిత నిర్ణయం తీసుకునే మార్గం ఉందన్నారు. న్యాయబద్ధంగా వెళ్లి సమస్య పరిష్కరించుకునే మార్గం ఉన్నప్పటికీ ఎందుకు ఈ రాజకీయ డ్రామాలు? ఎందుకు ఈ హంగామా? అని ప్రశ్నించారు.
ఇది బీసీల హక్కుల కోసం పోరాటం కాదు, ఏఐసీసీ దృష్టిలో పడేందుకు ఓ పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి బుసాని కమిషన్ నివేదిక సరిపోతుందని.. అయితే ఆ నివేదికను స్వీకరించడానికి సీఎం, మంత్రులు సమయం కేటాయించలేదని విమర్శించారు. అదే సమయంలో జస్టిస్ సుదర్శన్రెడ్డి వర్కింగ్ గ్రూప్ నివేదిక స్వీకరించడానికి సీఎం, డిప్యూటీ సీఎం, కొందరు మంత్రులు ఎంసీఆర్హెచ్ఆర్డీకి వెళ్లారని చెప్పారు. బుసాని కమిషన్, జస్టిస్ రెడ్డి కమిటీ మధ్య చూపిన ఈ తేడా రేవంత్ ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న ప్రతికూల వైఖరికి నిదర్శనం అని విమర్శించారు.