Kavitha: ఎన్డీఏలోనే బీసీ వ్యతిరేకత
ABN , Publish Date - Jul 09 , 2025 | 07:12 AM
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
42% బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలి: కవిత
న్యూఢిల్లీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఓబీసీనని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీకి ఆ వర్గాలకు న్యాయంచేసే అవకాశం లభించిందని, తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన 42ు బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో కవిత మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న నిర్వహించబోయే రైల్రోకోలో భాగంగా ఒక్క రైలునూ కదలనివ్వబోమని, డెక్కన్ నుంచి ఢిల్లీకి రైళ్లను రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (డీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి పెంచిన రిజర్వేషన్లను అమలు చేయవచ్చని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉండదని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే ఉంటారని కవిత స్పష్టం చేశారు.