విజిబుల్ పోలీసింగ్లో మహిళా సిబ్బంది
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:18 AM
విజిబుల్ పోలీసింగ్లో మహిళా సిబ్బంది భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మహిళా పోలీసు సిబ్బంది, అధికారులకు సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో శుక్రవారం కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): విజిబుల్ పోలీసింగ్లో మహిళా సిబ్బంది భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మహిళా పోలీసు సిబ్బంది, అధికారులకు సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో శుక్రవారం కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ‘సేఫ్ హ్యాండ్స్ విత్ తెలంగాణ పోలీస్-నారీశక్తి ఇన్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్’ అనే థీమ్తో కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ఆలం మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన మూడు రోజుల మహిళా నారీ శక్తి కార్యక్రమ సారాంశాన్ని తెలిపేందుకు ఈ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారన్నారు. బాధిత మహిళలకు మహిళా పోలీసులు అందుబాటులో ఉండి వారిలో ఆత్మస్థయిర్యం పెంపొందిస్తారన్నారు. మహిళా పోలీసులను బీట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి శాంతి భద్రతల విధులకు కేటాయిస్తామన్నారు. డయల్ 100 కాల్స్ అటెండ్ చేయడంలో మరింత క్రియాశీలంగా భాగస్వాములను చేస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా ఐఎంఏ కరీంనగర్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే సీపీఆర్పై (కార్డియోపల్మనరీ రిసక్షేషన్) శిక్షణ అందించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ (పరిపాలన), భీంరావు (ఏఆర్), ఏసీపీలు మాధవి, యాదగిరిస్వామి, శ్రీనివాస్ జి, వెంకట స్వామి, సీఐలు శ్రీలత, ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ స్వర్ణ జ్యోతి, రిజర్వ్ ఇన్స్పెక్ట్టర్లు రజినీకాంత్, కిరణ్ పాల్గొన్నారు.
ఫ మహిళా బ్లూ కోల్ట్స్ సేవలు ప్రారంభం
మహిళా బ్లూ కోల్ట్స్ పోలీసుల సేవలను సీపీ గౌస్ఆలం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన మహిళా పోలీసులకు స్కూటీలను అందజేశారు.