బకాయిల మాటేమిటో?
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:25 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) సన్న రకం వరి సాగు వైపు రైతులను మళ్లించడానికి ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహంగా ప్రకటించిన క్వింటాళుకు రూ. 500 బోనస్ కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత యాసంగి సీజన్లో విక్రయించిన సన్నరకం ధాన్యం బోనస్ కోసం ఆరు నెలలుగా రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నా సన్నరకం బకాయిల మాట మాత్రం చెప్పడం లేదు.
- రైతులకు అందని సన్నరకం బోనస్
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సన్న రకం వరి సాగు వైపు రైతులను మళ్లించడానికి ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహంగా ప్రకటించిన క్వింటాళుకు రూ. 500 బోనస్ కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత యాసంగి సీజన్లో విక్రయించిన సన్నరకం ధాన్యం బోనస్ కోసం ఆరు నెలలుగా రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నా సన్నరకం బకాయిల మాట మాత్రం చెప్పడం లేదు. బుధవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఽధాన్యం కొనుగోలు చేశాక 48 గంటల్లో రైతులకు మద్దతు ధరతో పాటు సన్నాల బోనస్ జమ చేస్తామని ప్రకటించారు. గత ఏడాది యాసంగిలో సన్నాల బోనస్ మాత్రం విడుదల చేస్తామని చెప్పకపోవడం రైతులు అయోమయంలో పడ్డారు. జిల్లాలో కొందరు రైతులు సన్నరకం ధాన్యం ప్రైవేట్ వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఫ సన్న రకం ధాన్యం బోనస్ రూ 4.38 కోట్లు పెండింగ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సీజన్లో 244 కొనుగోలు కేంద్రాల ద్వారా 44,767 మంది రైతుల నుంచి రూ. 624.89 కోట్ల విలువైన 2.69 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం ధాన్యం 2.60 లక్షల మెట్రిక్ టన్నులు, సన్నరకం 8,786 మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సన్నరకం ధాన్యంలో ఐకేపీ ద్వారా 7291 మెట్రిక్ టన్నులు, సింగిల్ విండోల ద్వారా 1,388 మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా 105 మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1,255 మంది రైతులు సన్నరకం బోనస్కు అర్హులుగా ఉన్నారు. ఇందుకు సంబంధించి బోనస్ బకాయిలు రూ 4.38 కోట్లు పెండింగ్లో ఉన్నాయి.
ఫ తగ్గిన సన్నాల సాగు
ప్రభుత్వం ప్రకటించిన బోనస్తో సన్నాల సాగుపై ఆసక్తి చూపిన రైతులు డబ్బులు రాకపోవడంతో వానాకాలంలో సన్న రకాల సాగు తగ్గించారు. గత ఏడాది వానాకాలం సీజన్లో 13 వేల ఎకరాల్లో సన్న రకాల సాగు చేశారు. రైతులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ 500 బోనస్ జమ చేయడంతో యాసంగి సీజన్లో సన్నల సాగును పెంచుకుంటూ 17 వేల ఎకరాలు చేశారు. ఆరు నెలలుగా బోనస్ రాకపోవడంతో ప్రస్తుత వానకాలం సీజన్లో 9,478 ఎకరాలకి పరిమితం అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో వానకాలం సీజన్ 1.84 లక్షల ఎకరాలు వరి సాగు చేశారు. దిగుబడి 4.54 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో దొడ్డు రకం 4.37 లక్షల మెట్రిక్ టన్నులు, సన్న రకం 17,032 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ 3.24 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 3.15 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, 9 వేలు మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం కొనుగోలు చేయనున్నది. అక్టోబరులో 47,584 మెట్రిక్ టన్నులు ధాన్యం మార్కెట్లో వస్తుందని అందులో పౌరసరఫరాల శాఖ ద్వారా 5 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు, నవంబరులో 341060 మెట్రిక్ టన్నుల్లో 1.80 లక్షల మెట్రిక్ టన్నులు, డిసెంబరులో 65,622 మెట్రిక్ టన్నుల్లో 80 వేల మెట్రిక్ టన్నులు, 2026 జనవరిలో 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు ఉండగా 231 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకేపీ ద్వారా 144 కేంద్రాలు, సింగిల్ విండోల ద్వారా 79 కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా ఒకటి, మెప్మా ద్వారా 7 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.