Share News

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:18 AM

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు. ‘నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్‌లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సీపీ గౌష్‌ ఆలం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

- పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు. ‘నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్‌లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల, పాఠశాల విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీ కలెక్టరేట్‌ నుంచి తెలంగాణ చౌక్‌ మీదుగా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వరకు కొనసాగింది. పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ ఈ ర్యాలీలో పాల్గొని డ్రగ్స్‌ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పోలీస్‌ కమిషనరేట్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ గౌష్‌ ఆలం మాట్లాడారు. వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా చాలా మంది డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని, మత్తు పదార్థం మానసికంగా, శారీరకంగా తీవ్ర నష్టం చేస్తుందని అన్నారు. ఒత్తిళ్లను అధిగమించేందుకు స్నేహితులతో మాట్లాడడం, పుస్తకాలు చదవడం, సామాజిక సేవ వంటి అనేక మార్గాలు ఉన్నాయని సూచించారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాటట్లాడుతూ డ్రగ్స్‌రహిత సమాజం కోసం స్వచ్ఛంద సంస్థలు, అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు మత్తు పదార్థాల నివారణపై చేసిన నృత్యరూపకం ఆకట్టుకుంది. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అడిషనల్‌ డీసీపీలు వెంకటరమణ, భీమ్‌ రావ్‌, డీఐఓబీ గంగాధర్‌, సీడీపీఓ సబిత, ఎన్‌ఎంబీఏ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:18 AM