మూడు వందల మందికి ఆపద మిత్ర శిక్షణ
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:37 AM
విపత్తు సమయంలో ప్రజలను రక్షించేందుకు జిల్లాలోని మూడు వందల మందికి ఆపద మిత్ర శిక్షణ ఇచ్చామని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో మొట్ట మొదటగా కరీంనగర్ జిల్లాలో శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు.
కరీంనగర్ అర్బన్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): విపత్తు సమయంలో ప్రజలను రక్షించేందుకు జిల్లాలోని మూడు వందల మందికి ఆపద మిత్ర శిక్షణ ఇచ్చామని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో మొట్ట మొదటగా కరీంనగర్ జిల్లాలో శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. మంగళవారం బీసీ స్టడీ సర్కిల్లో విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో ఆపదమిత్ర మూడో విడత శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ వలంటీర్లు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 300 మంది వలంటీర్లకు మూడు విడతల్లో 12 రోజులు శిక్షణ ఇచ్చామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, రోడ్డు ప్రమాదాలు, తదితర ఆపద సమయాల్లో ఈ వలంటీర్లు తమ సేవలు అందిస్తారని తెలిపారు. కజిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనే విధంగా ఈ శిక్షణను ఇచ్చామని తెలిపారు. అనంతరం ఆపద మిత్ర వలంటీర్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.