Share News

రెండో విడత కాంగ్రెస్‌దే..

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:35 AM

పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకున్నా పోటీలో ఉన్న అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీల మద్దతుదారులుగా ఉండగా, పల్లె జనాలు అధికార పార్టీ వైపే మొగ్గు చూ పారు.

రెండో విడత కాంగ్రెస్‌దే..

జగిత్యాల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకున్నా పోటీలో ఉన్న అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీల మద్దతుదారులుగా ఉండగా, పల్లె జనాలు అధికార పార్టీ వైపే మొగ్గు చూ పారు. జిల్లాలో ఆదివారం ముగిసిన మలి విడత పంచాయతీ సమరంలో అధికార కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలిచారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం, జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్న బీఆర్‌ఎస్‌ బల పరిచిన అభ్యర్థులు ఆశించిన ఫలితాలు సాధించకున్నా పలు మండలాల్లో సత్తా చాటారు. గత ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు ఈ సారి కొన్న పంచాయతీల కు పరిమితమై కారు రెండో స్థానంలో నిలిచింది.

నిజామాబాద్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తు న్నప్పటికీ ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు తక్కువ సంఖ్యలో గెలుపొంది మూడో స్థానంలో నిలిచారు. పార్టీలకు ఎలాంటి సంబంధం లేకుండా బరిలోకి దిగిన స్వతంత్రులూ సైతం పలు స్థానాల్లో గెలుపొందడం గమనార్హం. పలు చోట్ల ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో జయాపజయా లు పదుల సంఖ్యల ఓట్లతో దోబూ చులాడాయి. ఈ ప్రక్రియ ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. సర్పంచ్‌ ఫలితాలను అధికారికంగా ప్రకటిం చిన అనంతరం రిటర్నింగ్‌ అధికారుల ఆద్వర్యంలో ఆయా పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహించారు. గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

జిల్లాలో 134 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు..

జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని జగిత్యాల అర్బన్‌, జగిత్యాల రూరల్‌, సారంగపూర్‌, రాయికల్‌, బీర్‌పూర్‌, చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం పరిధి లోని మల్యాల, కొడిమ్యాల మండలాల్లో జిల్లాలో మలి విడతలో 144 సర్పంచ్‌, 1,276 వార్డు సభ్యుల స్థానాలకు నామి నేషన్లు స్వీకరించారు. అయితే 10 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, 330 వార్డుల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 134 సర్పంచ్‌ స్థానాలకు 521 మంది అభ్యర్థులు, 946 వార్డులకు 2,662 మం ది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో విజయం సాధించారు. పల్లెల్లో విజేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌ రెడ్డిలు, చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పంచాయతీ ఎన్నికల తమ పార్టీకి చెందిన రాజకీయ వ్యవహారాలను నిర్వర్తించారు. జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గంలలో అత్యధిక సర్పంచ్‌ స్థానాలు కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు చెందిన డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా అభివృద్ధి, సంక్షేమం కొరకు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాని ప్రకటించారు. అయితే ప్రస్తుతం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ ఆధిక్యత సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాల్లో సైతం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిక్యతను చాటింది. జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యత సాధించగా, తదుపరి స్థానాల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీలు నిలిచాయి. జిల్లాలో మలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ సత్తాచాటినట్లయింది.

ఫఅత్యల్పంగా మల్యాల మండలంలో పోలింగ్‌

జిల్లాలోని ఏడు మండలాల్లో మొత్తంగా 78.35 శాతం పోలింగ్‌ నమోదు అయింది. అత్యధికంగా జగిత్యాల అర్బన్‌ మండలంలో 81.26 శాతం, అత్యల్పంగా మల్యాల మండలంలో 77.06 శాతం పోలింగ్‌ జరిగింది. బీర్‌పూర్‌ మండలంలో 80.25 శాతం, జగిత్యాల అర్బన్‌లో 81.26 శాతం, జగిత్యాల రూరల్‌లో 77.69 శాతం, కొడిమ్యాలలో 78.43 శాతం, మల్యాలలో 77.06 శాతం, రాయికల్‌లో 79.11 శాతం, సారంగపూర్‌లో 77.61 శాతం పోలింగ్‌ నమోదైంది. ఏడు మండలాల్లో కలిపి 2,08,168 మంది ఓటర్లుండగా ఇందులో 99,145 పురుషులు, 1,09,019 మంది మహిళలు, ఇతరులు నలుగురు ఉన్నారు. ఇందులో మొత్తం 1,63,074 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 70,642 పురు షులు, 92,432 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఫపోలింగ్‌లో అతివలే అధికం...

మలి విడత పోలింగ్‌లో మహిళలు అత్యధిక సంఖ్యలో ఓటు వేశారు. మలి విడతలో 1,63,074 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో పురుషులు 70,642, మహిళలు 92,432 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 21,790 మంది అధికంగా ఓటు వేశారు. కాగా జిల్లాలో మలి విడతలో ఉదయం 9 గంటలకు 20.45 శాతం, 11 గంటలకు 52.05 శాతం, మధ్యాహ్నాం 1 గంటకు 78.34 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఫఅంతర్గాంలో ఓటు వేసిన జగిత్యాల ఎమ్మెల్యే

జిల్లాలోని జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, రాధిక దంపతులు, జగిత్యాల అర్బన్‌ మండలం తిప్పన్నపేటలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ పూర్తి

-కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో రెండో విడత పోలింగ్‌ నిర్వహణ పూర్తి అయిందని జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న కేంద్రాన్ని కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ సందర్శించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. అంతకు ముందు జగిత్యాల రూరల్‌ మండలం పోరండ్ల, లక్ష్మీపూర్‌, జాబితాపూర్‌, రాయికల్‌ మండలం అల్లీపూర్‌, మహితాపూర్‌, ఇటిక్యాల, సారంగాపూర్‌ మండలం రేచపల్లి, జగిత్యాల అర్బన్‌ మండలం దరూర్‌, మల్యాల మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో అడిషనల్‌ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి.రాజాగౌడ్‌, జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీపీవో రఘువరన్‌, జిల్లా నోడల్‌ అధికారులు, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్‌, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 01:35 AM