Share News

పేదల కలలను సాకారం చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Jul 25 , 2025 | 12:40 AM

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఉందని.. అందులో తాను మంత్రిగా ఉన్నానని నిరుపేదల కలలను సాకారం చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు.

పేదల కలలను సాకారం చేయడమే లక్ష్యం
దివ్యాంగుడికి ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్‌ పత్రాన్ని అందజేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

గొల్లపల్లి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఉందని.. అందులో తాను మంత్రిగా ఉన్నానని నిరుపేదల కలలను సాకారం చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. గొల్లపల్లి మండలం ఆత్మకూర్‌ గ్రామంలో అత్తెన రాజమల్లు అనే నిరుపేద దివ్యాంగుడికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్‌ పత్రాన్ని లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టిస్తామని ప్రజలకిచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ మేరకు నిరుపేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తున్నామని, ఇదీ తమకు ఆత్మతృప్తిని కలిగిస్తోందన్నారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు నిరుపేదలను పట్టించుకోలేదని విమర్శించారు. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా తనను రాజమల్లు కలిసి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటానని తనతో చెప్పాడని, అందుకే ప్రత్యేక చొరవతో అతడికి ఇందిరమ్మ ఇంటి ప్రోసీడింగ్‌ పత్రాన్ని అందజేసి అతడి కళ్లలో ఆనందాన్ని చూస్తున్నాని మంత్రి పేర్కొన్నారు. పేదలు, ఆభాగ్యులు, బడుగుబలహీన వర్గాలవారికి తాను ఎల్లావేళలా వెన్నంటి ఉంటానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం గొల్లపల్లి మండల కేంద్రంలోని వైకుంఠధామాన్ని మంత్రి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా శ్మశానవాటిక వరకు రహదారి నిర్మాణానికి మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌, ఏఎంసీ చైర్మన్‌ భీమ సంతోష్‌, వైస్‌ చైర్మన్‌ పురపాటి రాజిరెడ్డి, తహసీల్దార్‌ వరందన్‌, ఎంపీడీవో రాంరెడ్డి, కాంగ్రెస్‌ యూత్‌ మండల శాఖ అధ్యక్షులు పురంశెట్టి గౌతమ్‌ రాజు, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు నేరెళ్ల మహేష్‌, నాయకులు రేవెళ్ల సత్యానారాయణ గౌడ్‌, కొండ్ర గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 12:41 AM