లెక్కలు తేల్చాల్సిందే..
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:04 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నామినేషన్ వేసిన నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు చేశారో వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. లేదంటే ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు అంటున్నారు.
-పంచాయతీ ఎన్నికల ఖర్చు సమర్పణకు 45 రోజుల గడువు
- లేకుంటే అనర్హత వేటు
- జిల్లాలో 385 జీపీలు.. 3,536 వార్డులు
- సర్పంచ్ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు 1,436 మంది
జగిత్యాల, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నామినేషన్ వేసిన నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు చేశారో వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. లేదంటే ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు అంటున్నారు. గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ఓడిన వారు ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. పోటీ చేసిన ప్రతీ ఒక్క అభ్యర్థి ఎన్నికల్లో పెట్టిన ఖర్చు లెక్కలను బిల్లులతో సహా ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి 45 రోజుల్లోగా చూపించాల్సిందేనని నిబంధనలు వెల్లడిస్తున్నాయి.
ఫజిల్లాలో 22 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలు, 3,536 వార్డులకు ఈనెలలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. కోరుట్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 మండలాల్లో ఈనెల 11వ తేదీన, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల్లోని 7 మండలాల్లో ఈనెల 14వ తేదీన, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఈనెల 17వ తేదీన ఎన్నికలు జరిగాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పోలింగ్ తేదీకి నిర్ణీత రోజుల ముందు ఆయా మండలాల్లో ప్రారంభమైంది. దీని ప్రకారం పోలింగ్ ముగిసిన 45 రోజుల్లోగా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలోని 385 సర్పంచ్ స్థానాలకు గాను 22 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో మొదటి విడతలో 4, రెండో విడతలో 10, మూడో విడతలో 6 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. జిల్లాలో 3,536 వార్డులకు గాను 957 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో మొదటి విడతలో 349, రెండో విడతలో 330, మూడో విడతలో 228 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి 1,436 మంది సర్పంచ్ అభ్యర్థులు, 7,327 మంది వార్డు పదవులకు పోటీ చేశారు. వీరంతా ఎన్నికల ఖర్చులు చెప్పాల్సిందే.
ఫనిబంధనలివే..
పెరుగుతున్న ఎన్నికల వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును కూడా ఎన్నికల సంఘం నిర్ణయించింది. అభ్యర్థులు బ్యాంక్ ఖాతా నుంచే వ్యయం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 5 వేల జనాభా పైబడిన పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి వ్యయ పరిమితిని రూ. 2.50 లక్షలు, వార్డు సభ్యులు రూ. 50 వేల లోపే ఖర్చు చేయాలి. అదేవిధంగా 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.30 వేలు లోపే ఖర్చు చేయాలి.
ఫ45 రోజుల్లోగా లెక్కలు సమర్పించాలి..
నామినేషన్ వేసిన తేదీ నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను 45 రోజుల్లోగా సమర్పించాలి. నూతన పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం తాము చేసిన ఎన్నికల వ్యయాన్ని సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు గడువులోగా సమర్పించకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గెలిచిన అభ్యర్థులు లెక్కలు చూపకుంటే అనర్హత వేటుకు గురవుతారు. అంతేకాకుండా ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఓడిపోయిన అభ్యర్థులు కూడా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. చట్టం 237 ప్రకారం ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలని అధికారులు కోరుతున్నారు.
ఫవాస్తవ లెక్కలు సమర్పించేనా..?
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ వ్యయ పరిమితిని విధించింది. అయితే అభ్యర్థులు మాత్రం ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి. అయిదు వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షలు, వార్డు అభ్యర్థులు రూ.50 వేలు ఖర్చు చేయాల్సి ఉండగా, రూ.50 లక్షల నుంచి రూ. కోటికి పైగా ఖర్చు చేసినట్లు చర్చలు చోటుచేసుకుంటున్నాయి. అధికార యంత్రాంగం కళ్లు గప్పి వ్యయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఏమేరకు ఖర్చుల వివరాలు చూపుతారో వేచి చూడాల్సిందే.