భూసమస్యల పరిష్కారమే ‘భూభారతి’ చట్టం లక్ష్యం
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:38 AM
భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకవచ్చిందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకవచ్చిందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. మండలంలోని ముస్కానిపేట గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రజల వద్దకు వెళ్లి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించాలనే లక్ష్యంతో ఈనెల 20వరకు గ్రామాలలో రెవన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. ప్రతి మనిషికి ఆధార్కార్డు ఉన్నట్లే భూమికి భూధార్కార్డు అందించడం జరుగుతుందన్నారు. ఇకమీదట భూముల క్రయవిక్రయాలకు తప్పనిసరిగా మ్యాప్ జతచేయాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రస్తుతం భూమి ఎవరి కబ్జాలో ఉందో తెలుసుకోవడానికి పంచనామా నిర్వహించి పట్టాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. భూముల మ్యుటేషన్ సమయంలో కుటుంబ సభ్యులందరికి తప్పనిసరిగా నోటీసులు జారీచేయాలన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంటేశ్వర్లు, తహసీల్దార్ ఫారూఖ్లతో పాటు రెవన్యూ అధికారులు పాల్గొన్నారు.