కొనుగోళ్లకు ఎండదెబ్బ
ABN , Publish Date - May 02 , 2025 | 11:59 PM
వరి కొనుగోలు కేంద్రాల్లో ఎండ తీవ్రతకు కాంటాలు కాక ఎక్కడిక్కడే ధాన్యం కుప్పలుగా పేరుకుపోయింది. ఈ సీజన్లో వర్షం భయంతో రైతులు వరి కోతలు ముందస్తుగా మొదలు పెట్టారు. కరీంనగర్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో11, దుర్శేడ్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 6, ఐకేపీ ఆధ్వర్యంలో 3 కేంద్రాలను ఏర్పాటు చేసి కోనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
కరీంనగర్ రూరల్, మే 2 (ఆంధ్రజ్యోతి): వరి కొనుగోలు కేంద్రాల్లో ఎండ తీవ్రతకు కాంటాలు కాక ఎక్కడిక్కడే ధాన్యం కుప్పలుగా పేరుకుపోయింది. ఈ సీజన్లో వర్షం భయంతో రైతులు వరి కోతలు ముందస్తుగా మొదలు పెట్టారు. కరీంనగర్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో11, దుర్శేడ్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 6, ఐకేపీ ఆధ్వర్యంలో 3 కేంద్రాలను ఏర్పాటు చేసి కోనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎండ తీవ్రతకు హమాలీలు సరిగా కాంటాలు వేయకపోవడంతో కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకు పోతున్నాయి. ఉదయం 10గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి హమాలీలు కాంటా లు వేస్తున్నారు. దీంతో కాంటాలు కాకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద్దే పడిగాపులు కాస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలంలో ఈ సీజన్లో 12,300 ఎకరాల్లో పంటలను సాగు చేయగా, 10,200 ఎకరాల్లో దొడ్డు రకం ధాన్యం, 2,100 ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశారు. గత సీజన్లో 1లక్ష 49 క్వింటాళ్ల వరి ధాన్యంను ఆయా కేంద్రాల్లో సేకరించారు. కరీంనగర్ మండలంలో కరీంనగర్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 719 మంది రైతుల వద్ద నుంచి 43వేల 558 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే ఐకేపీ ఆధ్వర్యంలో 175 మంది రైతుల వద్ద నుంచి 8,974 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. దుర్శేడ్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 490 మంది రైతుల వద్ద నుంచి 25,500 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం రాశులు కుప్పలు కుప్పలుగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మారుతున్న వాతావరణం దృష్ట్యా అకాల వర్షంతో రైతులు గుబులు చెందుతున్నారు. వర్షం కురిస్తే పండించిన పంట నేలపాలవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వెంటవెంటనే తూకం వేయాలని రైతులు కోరుతున్నారు.