క్రీడలను ప్రోత్సహించేందుకే వేసవి శిక్షణ శిబిరాలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:24 AM
క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మంగళవారం డీవైఎస్వో, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ సభ్యులతో వేసవి శిక్షణ శిబిరాలపై సమావేశం నిర్వహించారు.
- 12 నుంచి వేసవి శిబిరాలు ప్రారంభం
- నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్
కరీంనగర్ స్పోర్ట్స్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మంగళవారం డీవైఎస్వో, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ సభ్యులతో వేసవి శిక్షణ శిబిరాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మే 12 నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో శిబిరాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, క్రికెట్, చెస్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, ఖో-ఖో, కబడ్డీ, కరాటే, సాఫ్ట్బాల్, వాలీబాల్, యోగా, రెజ్లింగ్ క్రీడాంశాల్లో నాలుగు నుంచి 12వ తరగతిలోపు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నెలపాటు శిక్షణనిస్తూ పౌష్టికాహారం అందిస్తామన్నారు. ఈ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు మే 2 నుంచి 9న సాయంత్రం 5 గంటలలోపు ఫోటో, ఆధార్కార్డు జిరాక్స్తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీవైఎస్వో వి శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తుమ్మ రమేశ్రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి బి వేణుగోపాల్, పెటా అధ్యక్షుడు బి శ్రీనివాస్, అంతటి శంకరయ్య, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.