అందుబాటులో రైతులకు సరిపడా ఎరువులు..
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:50 AM
జిల్లాలో రైతులకు సరిపడా ఎరు వులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల నిల్వ కోసం ప్రత్యేకంగా గోదాంను ఏర్పాటుచేశామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు.
సిరిసిల్ల రూరల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రైతులకు సరిపడా ఎరు వులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల నిల్వ కోసం ప్రత్యేకంగా గోదాంను ఏర్పాటుచేశామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూర్ శివారులోని అపేరల్పార్క్లో వంద మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల ఎరువుల గోదాంను శుక్రువారం సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్తో కలిసి కలెక్టర్ సందీప్కుమార్ ఝా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎప్పుడైనా, ఎక్కడైనా అత్యవసర పరిస్థితుల్లో ఎరువుల కొరత ఏర్పడినప్పుడు అందజేసేందుకు ఈ గోదాంను ఏర్పాటు చేశామన్నారు. వంద మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్లో అందుబాటు లో పెడుతామన్నారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం మాట్లాడుతూ జిల్లా కు అవసరమైన ఎరువులు గతంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి మాత్రమే తెప్పిస్తున్నామని అన్నారు. అత్యవసర సమయంలో ఎరువులు కావాల్సి వస్తే ఇబ్బందులు ఎదురయ్యోవని గుర్తుచేశారు. ఈ ఇబ్బందులు అన్నింటిని దూరం చేసేందుకు కలెక్టర్ ఈ గోదాంను ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.