పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:53 AM
జగిత్యాల, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి ఫలితాలను మెరుగుపరిచే దిశగా విద్యాశాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. విద్యార్థులు పరీక్ష సమయంలో కాకుండా ఇప్పటి నుంచే అభ్యాసంపై దృష్టి పెట్టేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. డిసెంబరు 31 వరకు ఈ ప్రత్యేక సెషన్లు కొనసాగనున్నాయి. వచ్చే యేడాది జనవరి 1వ తేదీ నుంచి రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి కసరత్తులు జరుగుతున్నాయి.
- వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రణాళిక
- డిసెంబరు 31వ తేదీ వరకు అమలు
- సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల మధ్య సన్నద్ధత
- వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి రెండు పూటలు నిర్వహణ
- సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక కార్యాచరణ
- జిల్లాలో 12,370 మంది పదో తరగతి విద్యార్థులు
జగిత్యాల, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి ఫలితాలను మెరుగుపరిచే దిశగా విద్యాశాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. విద్యార్థులు పరీక్ష సమయంలో కాకుండా ఇప్పటి నుంచే అభ్యాసంపై దృష్టి పెట్టేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. డిసెంబరు 31 వరకు ఈ ప్రత్యేక సెషన్లు కొనసాగనున్నాయి. వచ్చే యేడాది జనవరి 1వ తేదీ నుంచి రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి కసరత్తులు జరుగుతున్నాయి. జిల్లాలోని అన్నిప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
సమయ పట్టిక..
ప్రతిరోజు రెండుసార్లు తరగతులు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. ఈ తరగతుల్లో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించడం, ఆత్మవిశ్వాసం పెంచడం, సందేహాలు నివృత్తి చేయడం తదితర కార్యక్రమాలు ఉంటాయి.
వారానికోసారి సమీక్ష...
ప్రతీ పాఠశాలలో వారానికి ఒకసారి ప్రత్యేక తరగతులపై సమీక్ష జరుగుతుంది. మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమాల అమలును పరిశీలిస్తారు. విద్యార్థులఅభ్యసన స్థాయి, మార్కుల పెరుగుదల వంటి అంశాలను రికార్డులుగా నమోదు చేయాలి. హాజరు కాని విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులు స్వయంగా సందర్శించి హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.
- గత ఫలితాల ఆధారంగా....
జగిత్యాల జిల్లా ఆవిర్భావం నుంచి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టాప్లో ఉంది. జిల్లాలో 2017 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలో 97.35 శాతం ఫలితాలు సాధించి అగ్రబాగాన నిలిచింది. 2018 సంవత్సరంలో స్వల్ప పెరుగుదలతో 97.56 శాతం సాధించగా, 2019 సంవత్సరంలో 99.73 శాతం ఫలితాలు సాధించగా, 2020 సంవత్సరంలో అత్యంత మెరుగ్గా 99.98 శాతం ఫలితాలతో సత్తా చాటారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 2021 సంవత్సరంలో వంద శాతం ఫలితాలు నమోదు అయ్యాయి. 2022 సంవత్స రంలో 91.37 శాతం ఫలితాలు, 2023 సంవత్సరంలో పదో తరగతిలో 84.05 శాతం ఫలితాలు, 2024 సంవత్సరంలో 95.76 శాతం ఉత్తీర్ణత రాగా గత యేడాది రాష్ట్రంలో 98.20 శాతం ఉత్తీర్ణతను సాధించి జగిత్యాల జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. జిల్లాలో గత విద్యా సంవత్సరంలో 11,849 మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 5,962 మంది బాలురు, 5,887 మంది బాలికలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి విద్యాధికారులు ఈసారి మంచి ఫలితాలు సాధించే విధంగా పాఠశాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
మార్గదర్శకాలు ఇలా...
- ఉపాధ్యాయులు సిలబస్ను జనవరి 10లోపు పూర్తి చేయాలి.
- ఆ తరువాత రివిజన్ తరగతులు ప్రారంభించాలి. ఎస్ఏ-1 పరీక్షల పలితాల ఆధారంగా విద్యార్థులను ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించాలి.
- సీ గ్రూప్ విద్యార్థులకు పునశ్చరణ తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహించాలి.
- ప్రతి ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకొని, వారిని వ్యక్తిగతంగా మార్గదర్శనం చేయాలి.
- విద్యార్థుల హాజరును 100 శాతం సాధించేలా పర్యవేక్షణ చేయాలి.