Share News

జోరుగా కొనుగోళ్లు

ABN , Publish Date - May 10 , 2025 | 12:46 AM

వరి కోతలు పూర్తికావస్తుండడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రద్దీ పెరిగింది. ప్రతి కేంద్రానికి వందలాది క్వింటాళ్ల వరిధాన్యం వచ్చి చేరుతున్నది. యాసంగి సీజన్‌లో ఇప్పటి వరకు 1,85,421 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు.

జోరుగా కొనుగోళ్లు

- ఇప్పటి వరకు కొన్న ధాన్యం విలువ రూ. 430 కోట్లు

- రైతులకు చెల్లించింది రూ. 306.51 కోట్లు

- చెల్లించాల్సిన బకాయి రూ. 123.66 కోట్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వరి కోతలు పూర్తికావస్తుండడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రద్దీ పెరిగింది. ప్రతి కేంద్రానికి వందలాది క్వింటాళ్ల వరిధాన్యం వచ్చి చేరుతున్నది. యాసంగి సీజన్‌లో ఇప్పటి వరకు 1,85,421 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. 27,903 మంది రైతులకు చెందిన ఈ ధాన్యం విలువ 430.18 కోట్లు కాగా ఇప్పటికే 306 కోట్ల 51 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మరో 123.66 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉన్నది.

ఫ జిల్లాలో 2,66,896 ఎకరాల్లో వరి సాగు

జిల్లావ్యాప్తంగా యాసంగిలో 2,66,896 ఎకరాల్లో వరిసాగు చేశారు. ఇందులో 1,99,051 ఎకరాల్లో దొడ్డు రకాలను, 67,845 ఎకరాల్లో సన్నరకాలను సాగు చేశారు. ఈ సీజన్‌లో 5,86,723 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో రైతుల సొంత అవసరాలకు మినహాయించుకునే ధాన్యంతోపాటు విత్తన పంటను మినహాయిస్తే 3.6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఇందులో 2,74,900 మెట్రిక్‌ టన్నుల దొడ్డురకం వరిధాన్యం, 85,054 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం రైతులు తీసుకువస్తారని భావించారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు 1,85,421 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చింది. ఇందులో 1,65,761 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దొడ్డురకానికి చెందినది కాగా, 19,660 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సన్నరకానికి చెందినది. జిల్లా యంత్రాంగం వేసిన అంచనాల్లో ఇప్పటికి కొనుగోలు కేంద్రాలకు వచ్చింది 50 శాతం మాత్రమే కావడం గమనార్హం. గత సీజన్‌లో ఇదే రోజు వరకు కొనుగోలు చేసిన ధాన్యంతో పోల్చితే 24 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఎక్కువే కొనుగోలు చేశారు. వరి కోతలు దాదాపుగా పూర్తికావస్తుండడంతో అధికారుల అంచనాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాకపోవచ్చని భావిస్తున్నారు. మరో లక్ష టన్నుల ధాన్యం వస్తే ఎక్కువే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఫ 19,660 మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం

ప్రభుత్వం సన్నరకాలకు ఈ సీజన్‌లో కూడా క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ చెల్లిస్తున్నది. ఇప్పటి వరకు 19,660 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం కొనుగోలు చేయగా దీనికి 9.21 కోట్ల బోనస్‌ డబ్బు చెల్లించాల్సి ఉన్నది. ఈ డబ్బు చెల్లింపు కోసం ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వరికోతలు పూర్తికావడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం పూర్తయింది. ఈ నెలాఖరు వరకు దాదాపుగా అన్ని కేంద్రాలకు ధాన్యం వస్తుందని, జూన్‌ మొదటి వారానికి కొనుగోళ్లు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.

Updated Date - May 10 , 2025 | 12:46 AM